
India Corona: 9 వేల కరోనా కేసులు.. 10 వేలకు పైగా రికవరీలు
537 రోజుల కనిష్ఠానికి బాధితుల సంఖ్య
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. ముందురోజు గత ఏడాది మే నాటి స్థాయికి తగ్గిన కొత్త కేసులు తాజాగా పెరిగాయి. మంగళవారం 11,57,697 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,283 మందికి వైరస్ సోకింది. ఒక్క కేరళలోనే 4,972 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరింది. నిన్న 10,949 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.39 కోట్ల(98.33 శాతం)కు పైగా ఉన్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ కట్టడిలోనే ఉండటం, కోలుకునేవారి సంఖ్య మెరుగవుతుండటంతో క్రియాశీల కేసులు 537 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,11,481(0.32 శాతం)గా ఉంది. 24 గంటల వ్యవధిలో 437 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో నమోదైన మరణాల సంఖ్యే 370గా ఉంది. మనదేశంలో ఈ మహమ్మారి అడుగుపెట్టిన దగ్గరి నుంచి 4,66,584 మరణాలు సంభవించాయి. మరోపక్క నిన్న 76,58,203 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 118 కోట్ల మార్కును దాటింది.