India Corona Update: 543 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,91,236 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8,774 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది....

Updated : 28 Nov 2021 13:27 IST

దిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,91,236 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8,774 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 9,481 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని ఆదివారం కేంద్రం వెల్లడించింది.

క్రియాశీల కేసుల సంఖ్య 1,05,691కి చేరింది. ఇది 543 రోజుల కనిష్ఠం. రికవరీ రేటు 98.34 శాతంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 621 మరణాలు సంభవించాయి. ఇందులో 554 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటివరకు 4,68,554 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 82 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 121 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మూడో దశలో కరోనా విజృంభిస్తే లక్షలాది మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. దీంతో వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి తీరు, దీనిపై వ్యాక్సిన్ల సమర్థత వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని