Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్​ సింగ్​కు సీఐడీ సమన్లు

బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్​కు మహారాష్ట్ర నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) సమన్లు జారీ చేసింది.....

Published : 27 Nov 2021 18:10 IST

ముంబయి: ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్​కు మహారాష్ట్ర నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) సమన్లు జారీ చేసింది. సోమవారం లేదా మంగళవారం నవీ ముంబయిలోని బేలాపూర్‌లో ఉన్న ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముంబయికి చెందిన కేతన్​ తన్నా, సోనూ జలాన్​, రియాజ్​ భాటియాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బలవంతపు వసూళ్లకు సంబంధించి జులై 30న పరంబీర్​సింగ్​తోపాటు మరో 29 మందిపై ఠాణే పోలీస్​ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పరమ్‌బీర్‌ పాత్ర ఏమేర ఉందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ కొన్ని ప్రశ్నలను కూడా సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పరమ్​బీర్​సింగ్​పై జారీ చేసిన నాన్​బెయిలబుల్ వారెంట్​ను ఠాణే కోర్టు శుక్రవారం రద్దు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఠాణే పోలీస్‌ స్టేషన్​లో పరమ్​బీర్​ సింగ్ హాజరయ్యారు​. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా కార్యాలయానికి వెళ్లలేదు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు