Norovirus: కేరళలో కొత్త వైరస్.. 13 మంది విద్యార్థులకు సోకిన వ్యాధి

కేరళలో మరో కొత్త వైరస్​ వెలుగు చూసింది. వయనాడ్‌ జిల్లాలో ‘నోరో వైరస్’​ అనే వ్యాధి బయటపడింది.....

Published : 12 Nov 2021 19:43 IST

తిరువనంతపురం: కేరళలో మరో కొత్త వైరస్​ వెలుగు చూసింది. వయనాడ్‌ జిల్లాలో ‘నోరో వైరస్’​ అనే వ్యాధి బయటపడింది. ఇది రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకినట్లు అధికారులు పేర్కొంటున్నారు. బాధితులంతా వయనాడ్​ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులుగా వెల్లడిస్తున్నారు. నోరో వైరస్​ అనేది అరుదైన వ్యాధి అని.. డయేరియా, వాంతులు ఈ వైరస్​ లక్షణాలుగా వైద్య నిపుణులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్​ఐవీ)కు పంపించారు. తాజా పరిస్థితులపై అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్​ సమావేశమయ్యారు. వైరస్​ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

కేరళలో అంతుచిక్కని వ్యాధులు..

అంతుచిక్కని వ్యాధులతో కేరళ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కోవలంలో వీధి శునకాలు మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రెండు వారాల్లోనే 20 కుక్కలు మృతి చెందాయి. ఏ వ్యాధి సోకి శునకాలు మృతి చెందాయనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలుసుకోలేకపోతున్నారు. అయితే.. వణుకు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఇంకా చాలా కుక్కలు నీరసంగా కనిపించాయని, అవి కూడా వ్యాధి బారినపడినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన శునకాలు రెండు రోజుల్లోనే మరణిస్తున్నాయన్నారు. ఈ మరణాలకు గాలి ద్వారా వ్యాపించే వైరస్​ ఇన్​ఫెక్షన్​ కారణంగా అనుమానిస్తున్నామని.. ‘కనైన్​ డిస్టెంపర్’ వైరస్​ కారణం​ కావచ్చని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మనుషులకు వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. నక్కలు, తోడేళ్లలో ఈ కనైన్​ డిస్టెంపర్​ వైరస్​ వ్యాప్తి సాధారణంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని