Farm laws: అమిత్‌ షా, రాజ్‌నాథ్‌.. ఈ 15 నెలలు ఎక్కడున్నారో..?

సాగు చట్టాలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వాటిపై నిరసనల్లో భాగంగా అన్నదాతలపై నమోదైన కేసుల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Updated : 20 Nov 2021 13:19 IST

 చిదంబరం విమర్శ

దిల్లీ: సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోదీ చేసిన సంచలన ప్రకటనను ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భాజపాపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ హయాంలో కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు వెలువడుతాయని ఎద్దేవా చేశారు. ‘ప్రధాని మోదీ ఎలాంటి కేబినేట్ సమావేశం నిర్వహించకుండానే ప్రకటన చేశారని మీరు గమనించారా? ముందస్తుగా కేబినెట్ ఆమోదం లేకుండా చట్టాలు రూపొందడం, రద్దు కావడం భాజపా హయాంలో మాత్రమే జరుగుతాయి’ అని విమర్శించారు. అలాగే కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్‌పై కూడా విమర్శలు చేశారు. ‘ప్రధానమంత్రి ప్రకటన అద్భుతమైన రాజనీతిజ్ఞతకు నిదర్శనమని హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ప్రధానికి రైతుల పట్ల అపారమైన శ్రద్ధ ఉందని భాజపా అధ్యక్షుడు నడ్డా అన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరి.. గత 15 నెలల కాలంలో ఈ గొప్ప నాయకులు ఎక్కడికెళ్లారు. వారి విలువైన సూచనలు ఎక్కడున్నాయి?’ అని దుయ్యబట్టారు. 

రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోండి: ప్రియాంక

ఇదిలా ఉండగా.. సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వాటిపై నిరసనల్లో భాగంగా అన్నదాతలపై నమోదైన కేసుల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రైతులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా.. ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అలాగే చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

శనివారం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా రైతులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాను. అలాగే లఖింపూర్ ఖేరి ఘటనలపై నేను మోదీకి లేఖ రాశాను. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా యూపీ ప్రభుత్వం ఈ కేసును తొక్కిపెడుతోందని తెలిపాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్‌ మిశ్రా.. ఇంకా కేంద్రమంత్రి పదవిలో కొనసాగితే.. బాధితులకు న్యాయం జరగదని చెప్పాను. అలాగే లఖ్‌నవూలో జరిగే సమావేశంలో ఆ మంత్రితో పాటు ప్రధాని ఒకే వేదికపై కూర్చోకూడదు. ఈ విషయం కూడా లేఖలో పేర్కొన్నాను’ అని అన్నారు. యూపీలోని లఖింపూర్‌ ఖేరిలో కేంద్రమంత్రి అజయ్‌  మిశ్రా తనయుడి వాహన శ్రేణి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని