రిక్షా కార్మికుడి కుటుంబానికి రూ.కోటికి పైగా ఆస్తి దానం 

రిక్షా కార్మికుడి నిస్వార్థ సేవలను మదిలో పదిలపర్చుకున్న ఆ వృద్ధురాలు తన ఉదారతను చాటుకుంది. రూ.కోటికిపైగా విలువైన ఆస్తులను అతడికి ధారాదత్తం చేసింది. తన భర్త, కూతురు ఉన్నప్పుడు పట్టించుకోని బంధుగణం ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి అండగా ఉంటామంటూ

Updated : 14 Nov 2021 16:02 IST

బుడ సామల్‌ దంపతులకు పత్రాలు అందిస్తున్న వృద్ధురాలు

కటక్‌, న్యూస్‌టుడే: రిక్షా కార్మికుడి నిస్వార్థ సేవలను మదిలో పదిలపర్చుకున్న ఆ వృద్ధురాలు తన ఉదారతను చాటుకుంది. రూ.కోటికిపైగా విలువైన ఆస్తులను అతడికి ధారాదత్తం చేసింది. తన భర్త, కూతురు ఉన్నప్పుడు పట్టించుకోని బంధుగణం ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి అండగా ఉంటామంటూ నమ్మబలికినప్పటికీ వృద్ధురాలు విశ్వసించలేదు. ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని భావించింది. ఒడిశా రాష్ట్రం కటక్‌ సమీపంలోని సంబల్‌పూర్‌కు చెందిన మినతి పట్నాయక్‌ (63) భర్తతో కలసి కటక్‌లోని సుతాహత్‌ క్రిస్టియన్‌ సాహిలో నివసిస్తోంది. వారి ఏకైక కుమార్తెకు పెళ్లి చేసి సంతోషంగా గడపాలని దంపతులు భావించారు. పెళ్లి సామగ్రిని సిద్ధం చేశారు. అంతలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురై 2020 జులైలో చనిపోయారు. 2021లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెను కూడా వృద్ధురాలు కోల్పోయింది. అప్పటివరకు పట్టించుకోని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సందిగ్ధానికి తావు లేకుండా తనకున్న రూ.కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామగ్రిని రిక్షా కార్మికుడు బుడ సామల్‌కు ధారాదత్తం చేస్తూ వీలునామా రాయించి రిజిస్ట్రేషన్‌ చేయించింది. సామల్‌ కుటుంబం 25 ఏళ్లుగా తమకు తోడుగా ఉంటోందని, తన కుమార్తెను అతడు పాఠశాలకు తీసుకెళ్లేవాడని వృద్ధురాలు గుర్తు చేసుకుంది. మందులు, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చేవాడని.. తన భర్త అనారోగ్యం పాలైనప్పుడు ఎంతో సాయం చేశాడని వివరించింది. రక్తసంబంధం లేకున్నా తమకు చేసిన సేవలకు బహుమతిగా అతడి కుటుంబానికి మంచి చేయాలనిపించిందని పేర్కొంది. 4నెలల నుంచి సామల్‌ కుటుంబం  తనతో ఉంటోందని, సరదాగా గడిచిపోతోందని, చివరివరకు ఆ కుటుంబంతోనే కలసి జీవిస్తానని ఆమె చెబుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని