Supreme Court: కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

సుప్రీం కోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

Published : 26 Aug 2021 18:23 IST

దిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. కొత్త న్యాయమూర్తులుగా వీరందరూ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది. ఒక్క ఖాళీ మాత్రమే మిగులుతుంది. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తొమ్మిది మందితో కూడిన కొత్త న్యాయమూర్తుల జాబితాను చీఫ్‌ జస్టిస్‌ చేసిన సిఫార్సులను పరిశీలించిన న్యాయశాఖ వాటిని ప్రధాని కార్యాలయానికి పంపించింది. ఈ నెల 17వ తేదీన చీఫ్‌ జస్టిస్‌ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఆ జాబితా అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లగా.. కొలీజియం సిఫార్సులకు ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకంపై న్యాయశాఖ త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

ఇక కొత్త న్యాయమూర్తుల్లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, సీనియర్‌ అడ్వకేట్‌ పి.ఎస్‌.నరసింహ ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బీవీ నాగరత్నకు 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని