UK: యూకే క్వారంటైన్‌ పాలసీ వివాదం.. ప్రతిచర్య తప్పదని భారత్‌ హెచ్చరిక!

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకే వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం జారీ చేసిన నూతన ప్రయాణ నిబంధనలపై భారత్‌

Updated : 21 Sep 2021 19:46 IST

దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకే వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం జారీ చేసిన నూతన ప్రయాణ నిబంధనలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా ‘వివక్షపూరితమైన విధానం’ అని కేంద్ర విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకున్న బ్రిటన్‌.. ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. 

‘‘వాస్తవానికి కొవిషీల్డ్‌ ఒరిజినల్‌ తయారీ సంస్థ యూకేకు చెందినదే. అంతేగాక, బ్రిటన్‌ అభ్యర్థన మేరకు భారత్‌ 50లక్షల డోసులను ఆ దేశానికి అందించింది. ఆ టీకాలను అక్కడి ఆరోగ్య వ్యవస్థ ఉపయోగించింది. అలాంటిది ఇప్పడు కొవిషీల్డ్‌ను యూకే గుర్తించకపోవడం వివక్షపూరిత విధానం. ఈ వివాదం గురించి యూకే విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లాం. మన భాగస్వామ్య దేశాలు వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇది పూర్తిగా విరుద్ధమైన చర్య. ఈ వివాదానికి వీలైనంత త్వరగా యూకే నుంచి సంతృప్తికర పరిష్కారం లభించకపోతే ఆ దేశంపై ప్రతిచర్య తీసుకునే అధికారం మాకుంది’’ అని కేంద్ర విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అటు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సమస్య పరిష్కారంపై యూకే నుంచి త్వరితగతిన హామీ రావాలని కోరినట్లు చెప్పారు. అంతకుముందు బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో భేటీ అయిన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌.. యూకే క్వారంటైన్‌ నిబంధనల అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధలను బ్రిటన్‌ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. దాని ప్రకారం  భారత్‌, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్‌ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు.. తమ ప్రయాణానికి ముందుగా, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయని, ఇది పూర్తిగా నేరపూరిత చర్యేనని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని