మన వీలర్‌ ఐలాండ్‌పై పాక్‌ కన్ను..!

‘వీలర్‌ ఐలాండ్‌ నుంచి అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం’.. ‘వీలర్‌ ఐలాండ్‌లో ఆకాశ్‌ క్షిపణి పరీక్ష’ ఇలా దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచే ప్రతి ప్రయోగంలో వీలర్‌ ఐలాండ్‌, చాందీపూర్‌ పేర్లు వింటూనే ఉంటాము..! పాక్‌ ఏకంగా ఇక్కడే తన వేగులను నియమించుకొంది.

Published : 15 Feb 2021 17:33 IST

కీలక ఆయుధ సమాచార సేకరణ

 బెహెర ఉదంతంతో బట్టబయలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘వీలర్‌ ఐలాండ్‌ నుంచి అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం’.. ‘వీలర్‌ ఐలాండ్‌లో ఆకాశ్‌ క్షిపణి పరీక్ష’ ఇలా దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచే ప్రతి ప్రయోగంలో వీలర్‌ ఐలాండ్‌, చాందీపూర్‌ పేర్లు వింటూనే ఉంటాం..! పాక్‌ ఏకంగా ఇక్కడే తన వేగులను నియమించుకొంది. వారి నుంచి మన శతఘ్నులు, బాంబులు, లాంచ్‌ప్యాడ్‌లు వంటి వాటి ఫొటోలు వీడియోలను  సేకరించడం మొదలు పెట్టింది. వీటి విశ్లేషించి మన ఆయుధాల లోటుపాట్లను కనుక్కోవచ్చు. యుద్ధ సమయాల్లో ఇలాంటి సమాచారం పాక్‌కు అదనపు బలాన్ని సమకూరుస్తుంది. దీనంతటికి సహకరిస్తోంది ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌గా తేలడంతో.. అధికారులు పక్కా ఆధారాలను సేకరించి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.

ఎవరా ఫొటోగ్రాఫర్‌..?

సాధారణగా డీఆర్‌డీవో అధీనంలోని వీలర్‌ ఐలాండ్‌, ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఛాందిపూర్‌) వంటి డీఆర్‌డీవో  ఆయుధ ప్రయోగశాలలకు విపరీతమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ నిర్వహించే కీలక పరీక్షలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించడం  చాలా అవసరం. వీటిని ఆ తర్వాత విశ్లేషణలకు, మీడియాకు సమాచారం అందించే సమయంలో వినియోగిస్తారు. ఇలాంటి వాటిల్లో క్షిపణులు, క్లస్టర్ బాంబుల ప్రయోగాలను వీడియో తీయడానికి ఈశ్వర్‌ చంద్ర బెహెరా అనే వీడియో గ్రాఫర్‌కు 2007లో డీఆర్‌డీవో కాంట్రాక్ట్‌ ఇచ్చింది. బాలాసోర్‌ పట్టణం బయట నివసించేవాడు. ఈ నియామకానికి ముందు డీఆర్‌డీవో అతనిపై పోలీస్‌ ఎక్వైరీ కూడా చేయించింది. అన్ని బాగానే ఉన్నాయనుకొని నియమించుకొంది. అతను ఈ రెండు ప్రదేశాల్లో వీడియోలను తీసేవాడు.  ఈ క్రమంలో 2013 నుంచి  అతను కీలక ప్రదేశాల్లోకి ప్రవేశించి అక్కడి పరిస్థితులను ఫొటోలు తీసి పాక్‌లోకి ఐఎస్‌ఐ ఏజెంట్లకు చేరవేసేవాడు. దీనికి ప్రతిఫలంగా అతనికి వివిధ ప్రదేశాల నుంచి నగదు అందేంది. 2015 జనవరి 22న నిఘా సంస్థలు ఇతన్ని చర్యలను పసిగట్టి తొలిసారి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాయి.

పాక్‌ యువతిని పెళ్లాడిన మేరఠ్‌ వాసి సాయంతో..

మేరఠ్‌కు చెందిన  అసీఫ్‌ అలీ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కరాచీలో ఉన్నాడు. ఆ తర్వాత అతని వీసా గడువు ముగిసింది. కానీ, అతను కరాచీని వీడకపోవడంతో 2007లో పాక్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పాక్‌కు సాయం చేస్తానని అతను హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. ఈ షరతుల ప్రకారం పాక్‌ నిఘా సంస్థలకు భారత్‌లోని మూడు కాంటాక్ట్‌ నెంబర్లను అలీ ఇవ్వాల్సి వచ్చింది. వీటిల్లో బెహెరా నెంబర్‌ కూడా ఒకటి. ఆ తర్వాత నుంచి అలీ, బెహెరాలతో పాక్‌ నిఘా ఏజెన్సీ ఐఎస్‌ఐ తరచూ సంప్రదింపులు జరిపేది. 2014లో అలీని పోలీసులు అరెస్టు చేశారు.

తొమ్మిదంకెల ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌..

భారత నిఘా సంస్థలు బెహెరాకు వచ్చిన ఫోన్‌కాల్స్‌పై నిఘా ఉంచి కీలక సమాచారాన్ని సేకరించాయి. వీటిల్లో తొమ్మిదంకెలు ఉన్న ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌ రావడాన్ని గుర్తించాయి. వాటి ముందు +91 సంఖ్య ఉండేది. వాస్తవానికి ఈ సంఖ్య భారత్‌ దేశ కోడ్‌. కానీ, 10 అంకెలు ఉండాల్సిన నెంబర్‌లో ఒక సంఖ్య తగ్గేది. ఇలా చేస్తే ఆ తగ్గిన అంకె ఎక్కడిదో నిఘా సంస్థలు గుర్తించడం చాలా కష్టం. అప్పుడు కాల్‌ చేసినవారి వివరాలు గోప్యంగా ఉంటాయి. సాధారణంగా హ్యాకర్లు తమ ఐడీ, జరిమానాలను తప్పించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. పోలీసుల విచారణలో బెహెర కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తాను హైదరాబాద్‌ నుంచి కల్నల్‌ శ్రీవాస్తవ అనే పేరుతో తొమ్మిదంకెల సంఖ్య ఉన్న నెంబర్‌ నుంచి కాల్స్‌ తీసుకొన్నట్లు వెల్లడించాడు.  అతడు ఆయుధ పరీక్షల, టెస్ట్‌సెంటర్ల వివరాలు కోరినట్లు తెలిసింది.

వాస్తవానికి బెహెరాకు కూడా పాక్‌ నుంచి కాల్స్‌ అందుకొంటున్నట్లు తెలుసు. 2014లో అతనికి వచ్చి ఓ కాల్‌ను నిఘా సంస్థలు విశ్లేషించగా.. పాక్‌లో ఉన్నానని చెబుతున్న వ్యక్తితో బెహెర సంభాషించినట్లు తేలింది. అతను ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లోని కార్యకలాపాలపై వివరాలు తెలుసుకొన్నట్లు వెల్లడైంది.

ఆసిఫ్‌ అలీ వివిధ పేర్లతో బెహెరకు ఈ మనీ ఆర్డర్ల రూపంలో నిధులను పంపినట్లు తేలింది. 2014 జులైలో రెండు సార్లు  ఈ విధానంలో నిధులు చేతులు మారాయి. అబుదాబీ, ముంబయి, దిల్లీ, అలహాబాద్‌ల నుంచి బెహెర ఖాతాలో నిధులు జమ అయ్యాయి. 2014లో అరెస్టు అయిన అలీ నుంచి సేకరించిన సమాచారం ఈ విషయాలను పోలీసులు నిర్ధారించుకొన్నారు.  గత గురువారం ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి బెహెరాకు జీవిత ఖైదు విధించారు. అంతేకాదు రూ.10,000 అపరాధ రుసుం విధించారు.  వాస్తవానికి సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో పాక్‌ వేగుల కార్యకలాపాలు  ఉంటాయి. కానీ, కొన్నేళ్లుగా భారత తూర్పుతీర ప్రాంతంలోని వైజాగ్‌, ఒడిశాల్లో  వీరి కదలికలు పెరిగాయనడానికి బెహెర కేసే ఓ ఉదాహరణ.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని