18ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌..రాష్ట్రాలేమంటున్నాయ్‌?

విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి వేగానికి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాల్సిందిగా మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా అర్హులందరూ..

Updated : 30 Apr 2021 19:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి వేగానికి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాల్సిందిగా మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా అర్హులందరూ రిజిస్టర్‌ చేసుకునే విధంగా గత బుధవారమే కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే దాదాపు 2.45కోట్ల మంది పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వీరందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. వ్యాక్సిన్‌ కొరతే దీనికి ప్రధాన కారణం. అందులో భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలూ ఉండటం గమనార్హం. మరోవైపు కేంద్రం తన మార్గదర్శకాలను సమర్థించుకుంటోంది. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం కోటి డోసులు అందుబాటులో ఉన్నాయని, మరి కొన్ని రోజుల్లో మరో 20 లక్షల డోసులు వస్తాయని అంటోంది. 

మహారాష్ట్ర

18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌  ఇవ్వాలన్న అంశంపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే స్పందించారు. తక్షణం 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్‌ వయల్స్‌ రాష్ట్రానికి రాకపోతే మూడో విడత వ్యాక్సినేషన్‌ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేశారు. ‘‘కరోనా మూడో విడత వ్యాప్తి కూడా పొంచి ఉంది. రాష్ట్రానికి 12 కోట్ల డోసులు అవసరముంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగా ముంబయి నగరకార్పొరేషన్‌ పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కర్ణాటక

మూడో విడత వ్యాక్సినేషన్‌పై కర్ణాటకలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి అవసరమైనన్ని వయల్స్‌ రాష్ట్రంలో లేవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కోటి డోసులను ఆర్డర్‌ చేశాం. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఇంకా వాటిని అందించలేదు. అందువల్ల 18-44 మధ్య వాళ్లు వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కచ్చితంగా తెలియజేస్తాం’ అని చెప్పారు.

దిల్లీ

దిల్లీలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రేపటి నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం చెప్పినప్పటికీ దిల్లీలో అదే మాత్రం కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యాక్సిన్‌ కోసం కేంద్రాల ఎదుట ఎవరూ బారులు తీర వ్దని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లు అందలేదని, దీని కోసం వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలతో మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే వ్యాక్సిన్లు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవా
రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు లేవని, అందువల్ల మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కుదరదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. అదెప్పుడన్నది చెప్పలేమన్నారు.

మధ్యప్రదేశ్‌

మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం లేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు సకాలంలో డోసులను సరఫరా చేయలేకపోయినందున ఇది సాధ్యపడలేదన్నారు. అయితే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యథావిథిగా కొనసాగుతుందన్నారు.

పశ్చిమ్‌బెంగాల్‌

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ చేపట్టాలంటే కనీసం మూడు కోట్ల డోసులను సరఫరా చేయాల్సిందిగా పశ్చిమ్‌బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ప్రభుత్వ ఆస్పత్రులకు 2 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు కోటి డోసులు సమకూర్చాలని కోరింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న కోటి మందికి రెండు కోట్ల డోసులు అవసరమవుతాయని, మిగతా 50 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకుంటారని చెప్పింది.

పంజాబ్‌

వ్యాక్సిన్ల కొరత కారణంగా పంజాబ్‌లో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ స్పష్టం చేశారు. ‘‘ రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు రాలేదు. అందుకే సమస్యలు ఎదురవుతున్నాయి. మనకు తగిన సిబ్బంది, వసతులు ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం’’ అని ఆయన చెప్పారు.

తెలంగాణ

రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను అందించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ‘‘ ఇది కేంద్రం బాధ్యత. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాం. అయితే, వ్యాక్సిన్ల లభ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ఏదైనా సమాచారమొస్తే మూడో విడత వ్యాక్సినేషన్‌పై క్లారిటీ వస్తుంది అని చెప్పారు.

గుజరాత్‌

ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ మూడో విడత వ్యాక్సినేషన్‌ మే 1న ప్రారంభం కావడం లేదు. అన్ని సజావుగా సాగితే మే 15 నుంచి 18 ఏళ్లు పూర్తయిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థకూ 50 లక్షల డోసుల చొప్పున కోటి డోసులను ఆర్డర్‌ చేశామని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేదని  యూపీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుత నిల్వలు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే సరిపోతాయని స్పష్టం చేశారు.
 
దీనిని బట్టి దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేరకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే దాఖలాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని