రాజు పట్ల చిన్న తప్పిదానికి అంత శిక్షా!

ఓ థాయిలాండ్‌ న్యాయస్థానం.. మాజీ ప్రభుత్వోద్యోగినికి నలభై మూడున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ దేశపు రాజు గురించి అవమానకరంగా మాట్లాడినందుకు 65 ఏళ్ల మహిళకు ఈ శిక్ష

Published : 20 Jan 2021 09:39 IST

బ్యాంకాక్‌: ఓ థాయిలాండ్‌ న్యాయస్థానం.. మాజీ ప్రభుత్వోద్యోగినికి నలభై మూడున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ దేశపు రాజు గురించి అవమానకరంగా మాట్లాడినందుకు 65 ఏళ్ల మహిళకు ఈ శిక్ష వేసింది. తొలుత 87 ఏళ్ల శిక్ష విధించిన న్యాయస్థానం.. ఆ మహిళ నేరాన్ని అంగీకరించటంతో సగానికి తగ్గించింది. 

ఇంతకీ ఆమేం చేసిందంటే..

నిజానికి అధినేతను విమర్శించటం థాయిలాండ్‌లో నేరం. ఐతే అంచన్‌ అనే ఈ మహిళ.. ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల వేదికగా రాజు మహా వజ్ర లాంగ్‌కోర్న్‌ను విమర్శిస్తూ కామెంట్లు, ఆడియో సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నారు. ఆ దేశ శిక్షా స్మృతిలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ఇది తీవ్రమైన నేరం. ఈ విధమైన ఒక్కో తప్పిదానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు కోర్టులు కారాగార శిక్ష విధించవచ్చు. ఈ నేపథ్యంలో సదరు మహిళ దోషిగా నిర్థారణ కావటంతో బ్యాంకాక్‌ క్రిమినల్‌ కోర్టు ఆమెకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే దీనిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేసే అవకాశం ఉందని శిక్ష పడిన మహిళ తరపు న్యాయవాది తెలిపారు. 

శిక్ష దిగ్భాంతికరం

ఈ తీర్పు, శిక్ష దిగ్భాంతికరమని థాయిలాండ్‌ మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. రాజరికాన్ని విమర్శించటం సహించరానిదనే కాకుండా.. ఇందుకు తీవ్ర దండన ఉంటుందనే సందేశాన్నిస్తోందని థాయ్‌ లాయర్స్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ సంస్థ ప్రతినిధులు ఆక్రోశం వ్యక్తం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ రాజరిక వ్యవస్థలో ఈ విధమైన శిక్ష మంచిది కాదని విమర్శకులు అంటున్నారు.

ఇదీ చదవండి..

ఇక వెళ్లొస్తా.. మెలానియా వీడ్కోలు సందేశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని