Afghan Crisis: ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి.. ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తోన్న అఫ్గాన్‌ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి

Updated : 19 Aug 2021 18:53 IST

కాబుల్‌: ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తోన్న అఫ్గాన్‌ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను కాపాడమంటూ ఎయిర్‌పోర్టులో ఉన్న యూఎస్‌, యూకే దళాలను వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తోన్న తల్లులు ఎందరో..! ఆ హృదయ విదారక ఘటనలు చూస్తుంటే దుఖం పొంగుకొస్తోందని బ్రిటీష్‌ ఆర్మీ సీనియర్‌ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపిన విషయం తెలిసిందే. కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకొని వీరంతా పహారా కాస్తున్నారు. అయితే, తాలిబన్ల పాలనతో భయాందోళనకు గురైన అఫ్గాన్‌ వాసులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు గత సోమవారం ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అఫ్గాన్ వాసులను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. 

అయినప్పటికీ అక్కడకు చేరుకున్న వేలాది మంది అఫ్గానీయులు.. తమను కాపాడాలంటూ యూకే, యూఎస్‌ బలగాలను కోరుతున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అంటూ ఓ బ్రిటిష్‌ అధికారి మీడియాకు చెప్పారు. ఆ దృశ్యాలు తమను ఎంతగానో కలచివేస్తున్నాయని, వాటిని తలుచుకుని రాత్రిళ్లు తాము కన్నీరు పెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు రెండు రోజుల క్రితం వరకు శాంతిమంత్రం జపించిన తాలిబన్లు మళ్లీ తమ సహజ స్వభావాన్ని బయటపెడుతున్నారు. వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై కాల్పులు జరిపారు. దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నించిన వారిని చితకబాదారు. దీంతో అఫ్గాన్‌ వాసులు భయాందోళనలో కూరుకుపోయారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని