అప్పట్లో ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు..!

సమాజంలో అందం, శరీరఛాయ ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను తాను చూశానని నటి సాయిపల్లవి అన్నారు. ‘ప్రేమమ్‌’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే....

Updated : 23 Dec 2020 13:06 IST

అది నన్ను ఎంతగానో బాధపెట్టింది: సాయిపల్లవి

హైదరాబాద్‌: సమాజంలో అందం, శరీరఛాయ ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను తాను చూశానని నటి సాయిపల్లవి అన్నారు. ‘ప్రేమమ్‌’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ హిట్‌తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకొన్నారు. అయితే, రూ.2 కోట్లు ఇస్తామంటూ వచ్చిన ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నటి సాయిపల్లవి నో చెప్పారంటూ.. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నాడు ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నో చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘సింపుల్‌గా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నో చెప్పడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఆలోచన. సమాజంలో మనం సృష్టించిన అందం, శరీరఛాయ అనే వాటిని ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను నేను చూశాను. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే ‘ప్రేమమ్‌’కు ముందు మొటిమలు పొగొట్టుకోడానికి ఎన్నో రకాల క్రీమ్స్‌ వాడాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కాదు. ‘ఎదుటివారు కేవలం నా మొటిమలను మాత్రమే చూసి ఎందుకు మాట్లాడుతున్నారు.. నా కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదు’ అని బాగా ఆలోచించేదాన్ని. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ ‘ప్రేమమ్‌’ తర్వాత ప్రజలు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారు. దాని వల్ల ఎంతో మంది నా నుంచి ప్రేరణ పొందారు. ముఖ్యంగా టీనేజీ ఆడపిల్లలు. అది నాలో ధైర్యాన్ని నింపింది. సమాజంలో వాళ్లు ఒంటరి కాదు అని నిరూపించాలనుకున్నా. అంతేకాకుండా తెల్లగా మారడం కోసం నా సోదరి తనకి ఇష్టంలేని ఆహార పదార్థాలను సైతం తినేది. కాబట్టి, నా సోదరిలో ప్రేరణ నింపాడానికైనా నేను నాలానే ఉండాలని నిశ్చయించుకొన్నా. అందుకే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నో చెప్పాను’’ అని సాయిపల్లవి తెలిపారు.

వెట్రిమార‌న్ ద‌ర్శక‌త్వంలో సాయి ప‌ల్లవి న‌టించిన ‘పావ క‌దైగ‌ల్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవ‌ల విడుద‌ల అయ్యింది. ఇందులో సాయి ప‌ల్లవి న‌ట‌నకు మంచి మార్కులు ప‌డ్డాయి. ప్రస్తుతం ఆమె రానా స‌ర‌స‌న ‘విరాటప‌ర్వం’లో న‌టిస్తోంది. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సాయి ప‌ల్లవి న‌క్సలైట్‌గా క‌నిపించ‌నుంది. ‘విరాటపర్వం’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీనితోపాటు ఆమె నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి

సమంత.. అనుష్క.. కీర్తి.. మెరిసిందెవరు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు