Siddharth: ‘పాన్‌ ఇండియా’ అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్‌

సినిమాల్లో కొన్నింటిని పాన్‌ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా ఉందని నటుడు సిద్ధార్థ్‌ వ్యాఖ్యానించారు. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ రూపొందించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌-2’ సక్సెస్‌పై తాజాగా సిద్ధార్థ్‌ స్పందించారు.

Updated : 19 May 2022 14:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాల్లో కొన్నింటిని పాన్‌ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా ఉందని నటుడు సిద్ధార్థ్‌ వ్యాఖ్యానించారు. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ రూపొందించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌-2’ సక్సెస్‌పై తాజాగా సిద్ధార్థ్‌ స్పందించారు. తన తదుపరి సిరీస్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ‘పాన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘పాన్‌ ఇండియా.. వినడానికి ఎంతో ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి నేను వివిధ భాషల్లో చిత్రాలు చేస్తున్నా. తమిళ సినిమాల్లో చేస్తే తమిళయన్‌గా, టాలీవుడ్‌ చిత్రాలు చేస్తే పక్కా తెలుగింటి అబ్బాయిలా.. ఇలా ఏ భాషలో వర్క్‌ చేస్తే ఆ భాషలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొంటాను. వేరే వాళ్ల చేత డబ్బింగ్‌ చెప్పించుకోను. నా వరకూ ఆయా చిత్రాలను ఇండియన్‌ ఫిల్మ్స్‌ అని పిలవడమే ఇష్టం. ఎందుకంటే, పాన్‌ ఇండియా అంటుంటే కాస్త అగౌరవంగా అనిపిస్తుంది. వేరే ఎవర్నో ఇబ్బందిపెట్టాలని ఇలా చెప్పడం లేదు. చిత్రపరిశ్రమలో హిందీ సినిమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, ఆ భాష నుంచి విడుదలైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే వాటిని బాలీవుడ్‌ అనే అంటారు. కానీ, ప్రాంతీయ చిత్రాలు విశేషమైన ప్రేక్షకాదరణ పొంది, భారీ విజయాన్ని అందుకున్నప్పుడు వాటిని ఎందుకు పాన్‌ ఇండియా అని పిలవడం..? భారతీయ చిత్రం అని అభివర్ణించవచ్చు కదా. లేదా ‘కేజీయఫ్‌’ జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు కదా. లేదా ఆ సినిమా క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ని దృష్టిలో ఉంచుకునైనా దాన్ని ఇండియన్‌ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కాబట్టి, పాన్‌ ఇండియన్‌ సినిమా అని కాదు ఇండియన్‌ ఫిల్మ్‌ అని చెప్పండి. పాన్‌ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది’’ అని సిద్ధార్థ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని