Chiranjeevi: ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు ప్రభుత్వాలకు చిరు విజ్ఞప్తి

Tollywood: కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.

Updated : 19 Sep 2021 21:19 IST

హైదరాబాద్‌: ‘ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగు ప్రభుత్వాలను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ఖాన్, అగ్ర కథానాయకుడు చిరంజీవి విచ్చేశారు. ‘లవ్‌స్టోరీ’ చిత్ర బృందానికి చిరు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.

‘‘కొవిడ్‌ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావటం చిన్నపిల్లవాడు స్కూల్‌కు వెళ్తున్న భావన కలుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. చిత్ర పరిశ్రమలో సక్సెస్‌రేట్‌ అనేది చాలా తక్కువ. 10-15శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే, 20శాతం. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా, కళకళలాడిపోతోందంటారు. కానీ, ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది.. పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే చిత్ర పరిశ్రమ. నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. వీళ్లు బాగున్నారు కదాని, సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ విషయం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలు షూటింగ్స్‌ ఆగిపోయే సరికి, కార్మికులు అల్లాడిపోయారు. హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి డబ్బులు పోగుచేసి,  కార్మికుల కోసం నిత్యావసర సరకులు అందించాం. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. కానీ, ఒక నెల షూటింగ్‌ లేకపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా’’

‘‘ఏ విపత్తు వచ్చినా అందరి కంటే ముందు స్పందించేది చిత్ర పరిశ్రమ మాత్రమే! ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈరోజు సంక్షోభంలో పడిపోయింది. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఎక్కడా సర్దుకుపోయే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్‌ వేడుక వేదికగా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇంకా ఏం చేస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది? ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వస్తువులు, కాయగూరలను ముందు చూసి ఆ తర్వాత కొంటాం. కానీ ముందు కొనేసి, ఆ తర్వాత చూసేది సినిమాను మాత్రమే! మా మీద నమ్మకంతోనే మీరు(ప్రేక్షకులు) సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి ఉన్నాడంటే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని మరో ఆలోచన లేకుండా థియేటర్‌కు వస్తారు. మేము కూడా నిరాశ పరచకుండా మా వంతు కృషి చేస్తుంటాం. దాని వల్ల వ్యయం పెరగవచ్చు. కొన్ని సార్లు మా అభిరుచుల మేరకు సినిమా తీసి ఫెయిల్యూర్‌ కావచ్చు. అది మా తప్పిదం’’

‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకునే మాకు, సాధకబాధకాలు ఉన్నప్పుడు మీరు దయ చేసి దీనిపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలి. ‘మేము ఆశగా అడగటం లేదు.. అవసరానికి అడుగుతున్నాం’. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా. సినిమాలు పూర్తయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ‘ఆచార్య’ అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి? ఎలా రిలీజ్‌ చేయాలి? చేస్తే రెవెన్యూ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా? అన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. ‘లవ్‌స్టోరీ’ అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుందని అనుకుంటున్నా. అయితే, రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ విషయంలోనే ప్రభుత్వాలు మనకు ధైర్యం, వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని