F3: కుటుంబంతో కలిసి.. ఆనందించే చిత్రం

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్‌3’. ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా రూపొందింది. శిరీష్‌ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది

Updated : 22 May 2022 06:46 IST

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్‌3’. ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా రూపొందింది. శిరీష్‌ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ఫన్‌టాస్టిక్‌ ఈవెంట్‌ పేరుతో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ.. ‘‘నా సినిమా థియేటర్లలో విడుదలై మూడేళ్లైంది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల నా గత చిత్రాలు ‘నారప్ప’, ‘దృశ్యం2’ ఓటీటీకి వెళ్లాయి. ఇప్పుడు మళ్లీ ‘ఎఫ్‌3’తో థియేటర్లలోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇందులో వరుణ్‌ చాలా బాగా నటించాడు’’ అన్నారు.
* వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని థియేటర్లో మీ కుటుంబంతో కలిసి హాయిగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నా. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దేవిశ్రీ మంచి సంగీతమందించారు. దిల్‌రాజు బ్యానర్‌లో నాకిది మూడో సినిమా. అనిల్‌ రావిపూడి లాంటి పాజిటివ్‌ వ్యక్తి నేనెక్కడా చూడలేదు. ఈతరంలో ఆయనలా కామెడీ చేసే దర్శకుడు మరొకరు లేరు. వెంకటేష్‌ చాలా మందితో మల్టీస్టారర్లు చేశారు. ఆయనతో రెండోసారి పని చేసే అవకాశం నాకు దొరికింది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నా’’ అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల్ని నవ్వించడానికి రెండున్నరేళ్లు మేమెంతో కష్టపడ్డాం. ఈ చిత్ర విషయంలో మాకు ‘ఎఫ్‌2’నే పెద్ద శత్రువు. ఎందుకంటే దాన్ని అందరూ చాలా ఎంజాయ్‌ చేశారు. దాన్ని మించి నవ్వించాలన్న ఉద్దేశంతోనే స్క్రిప్ట్‌ దశ నుంచే ఎంతో కష్టపడి పనిచేశాం. మెహ్రీన్‌కు ఈ సినిమాతో మరింత మంచి పేరొస్తుంది. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌, అలీ.. ఇలా సినిమాలో ఉన్న 30మంది నటీనటులు కడుపుబ్బా నవ్విస్తారు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఎంతో కొంత విలువ తెలుసుకుంటారు. వరుణ్‌లో ఇంత కామెడీ టైమింగ్‌ ఉందా? అని అనిపించే చిత్రం ‘ఎఫ్‌3’. వెంకటేష్‌ రాగానే సెట్లో అందరికీ ఒక ఎనర్జీ వస్తుంది. కామెడీ చేసేటప్పుడు తన ఇమేజ్‌ను పక్కకు పెట్టి చిన్నపిల్లాడిలా చేస్తారు. వీళ్లిద్దరూ ‘ఎఫ్‌2’లో ఎంత నవ్వించారో.. అంతకు పదింతలు నవ్విస్తారు. రెండేళ్లు మనం చాలా ఒత్తిడిని అనుభవించాం. ఆ ఒత్తిడినంతా మర్చిపోయి థియేటర్లోకి వెళ్లి హాయిగా నవ్వుకోండి’’ అన్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సమాజంలో ఒక మనిషి బతుకులో నవ్వుకు ఎంత అవసరం ఉంది అని చెప్పే సినిమా ‘ఎఫ్‌3’. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన అత్యంత నవ్వులను పంచే చిత్రమిదే’’ అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘తొలి సీన్‌ నుంచి ఆఖరి సీన్‌ వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలన్న లక్ష్యంతోనే అనిల్‌ రావిపూడి ఈ చిత్రం సిద్ధం చేశారు. పక్కాగా రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్విస్తాం. ప్రేక్షకులకు పసందైన విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు. నటి మెహ్రీన్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. చేసేటప్పుడు మేమెంత ఎంజాయ్‌ చేశామో.. చూసేటప్పుడు మీరూ అంతే ఆనందిస్తారని కచ్చితంగా చెప్పగలను’’ అంది. ‘‘ఇంత అద్భుతమైన ఫన్‌టాస్టిక్‌ చిత్రంలో నన్ను భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అంది నటి సోనాల్‌ చౌహాన్‌. ఈ కార్యక్రమంలో సునీల్‌, అలీ, పృథ్వి, ప్రగతి, తులసి, వై.విజయ, హర్షిత్‌ రెడ్డి, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్‌, ప్రదీప్‌ తదితరులు   పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని