‘మెగా’ మూవీస్‌.. ఆమె చుట్టే గాసిప్స్‌!

మెగా కాంపౌడ్‌కు చెందిన అగ్ర, యువ హీరోలందరూ వరుసపెట్టి ప్రాజెక్ట్‌లు ఓకే చేసేస్తున్నారు. చేతిలో ఒక ప్రాజెక్ట్‌ ఉండగానే మరో ప్రాజెక్ట్‌ను సైతం పట్టాలెక్కించేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆ హీరోలు చేయబోయే....

Updated : 01 Feb 2021 18:11 IST

నెట్టింట పోస్టులు వైరల్‌

హైదరాబాద్‌: మెగా కాంపౌండ్‌కు చెందిన అగ్ర, యువ హీరోలందరూ వరుస పెట్టి ప్రాజెక్ట్‌లు ఓకే చేసేస్తున్నారు. చేతిలో ఒక ప్రాజెక్ట్‌ ఉండగానే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆ హీరోలు చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించి పలు ఊహాగానాలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అలా, మెగా హీరోలకు సంబంధించిన కొన్ని భారీ ప్రాజెక్ట్‌లలో ఓ నటి లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఎవరానటి? ఏమా చిత్రాలు? మీరూ ఓ లుక్కేయండి..!

నటి ఎవరంటే..!

అందం, అభినయం, డ్యాన్స్‌తో.. ఎంతో మంది అభిమానులను ‘ఫిదా’ చేసి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. డ్యాన్స్‌షోతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ‘ప్రేమమ్‌’తో(మలయాళీ చిత్రం) నటిగా మారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు. ‘ఫిదా’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇక్కడ కూడా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు, తమిళ చిత్రాలున్నాయి.


మెగాస్టార్‌ సోదరిగా..

మెగాస్టార్‌ మనసును హత్తుకున్న కోలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘వేదాళం’. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్న చిరు త్వరలో ‘వేదాళం’ రీమేక్‌లో బిజీ కానున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు మెహర్‌ రమేశ్‌ టాలీవుడ్‌కు తగినట్లుగా ‘వేదాళం’ రీమేక్‌ పనులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన సోదరి(లక్ష్మీమేనన్‌) పాత్రను తెలుగులో సాయిపల్లవి చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి సోదరిగా చేయడానికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


పవర్‌స్టార్‌ సినిమాలో..

మలయాళీ సూపర్‌హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం‌’. ఇటీవల ఈ సినిమా తెలుగు రీమేక్‌ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సాయిపల్లవి ఓ కీలక పాత్రలో నటించనునున్నారని సమాచారం. అంతేకాకుండా ఆమె త్వరలోనే ఈ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారంటూ అందరూ చెప్పుకుంటున్నారు. పవన్‌కు జోడీగా ఐశ్వర్యరాజేశ్‌ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో సాయిపల్లవి రానా సరసన నటిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మాతృక ప్రకారమైతే రెండు, మూడు సన్నివేశాల్లో పవన్‌-సాయి పల్లవి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఖాయం.


స్టైలిష్‌స్టార్‌ మరదలిగా..

సుకుమార్‌-స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక, ఈ సినిమాలో సాయిపల్లవి ఓ కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. రష్మిక సోదరిగా.. బన్నీ మరదలిగా ఈ సినిమాలో సాయిపల్లవి నటించే అవకాశాలున్నాయంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

ఇదీ చదవండి

రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోడానికి కారణమదే: దీపిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని