Pushpa: కారణమేదైనా... ఈ నటులు ‘పుష్ప’ను వదులుకున్నారా?

ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు పోషించడమనేది సినిమాల్లో సర్వసాధారణం. తొలుత దర్శకుడు వీళ్లైతే.. బాగుంటారనుకున్నా ఆఖరి నిమిషంలో.. ఆ నిర్ణయాలు తారుమారవుతుంటాయి.

Published : 27 Jan 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు పోషించడమనేది ఇండస్ట్రీలో సర్వసాధారణం. తొలుత వీళ్లైతే.. బాగుంటారనుకున్నా ఆఖరి నిమిషంలో.. ఆ నిర్ణయాలు తారుమారవుతుంటాయి. గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఇలా జరిగాయని వింటూనే వచ్చాం. సరిగ్గా ‘పుష్ప’ విషయంలోనూ ఇదే జరిగిందట. కారణాలు ఏవైనా ఈ సినిమాను కాదనుకున్న ఆ నటులెవరో ఓ లుక్కేద్దాం పదండి!

మొదట..  మహేశ్!

మహేశ్‌బాబుతో ‘1: నేనొక్కడినే’ తీశాక... దర్శకుడు సుకుమార్‌ మరోసారి ఆయనతో మాస్‌ మూవీ తీయాలని భావించారట. అదే ‘పుష్ప’. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్‌ లుక్స్‌ పరంగా వివిధ రకాలుగా కనిపించాల్సి ఉంటుంది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం, క్యారెక్టర్‌ లుక్‌ విషయంలో..  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. అలా మహేశ్‌ చేయాల్సిన ‘పుష్పరాజ్‌’ అల్లు అర్జున్‌కు చేరువైందని ఇండస్ట్రీ టాక్‌.

శ్రీవల్లి.. ‘సమంత’నే..

‘ఉ అంటావా.. ఊ ఊ అంటావా’ అని సమంత ఐటమ్‌ సాంగ్‌తో ఓ ఊపు ఊపినా.. అసలు సామ్‌ చేయాల్సింది ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’లోనట. ‘రంగస్థలం’లో ‘రామలక్ష్మీ’గా మెప్పించిన ఆమెను ‘శ్రీవల్లి’గానూ చూపించాలని సుకుమార్‌ అనుకున్నారట. పలు కారణాలతో సమంత ‘నో’ చెప్పడం.. ఆపై కథ రష్మికకు చెప్పడం.. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట!

ఊ ఊ అన్నది వీళ్లేనట..

సుకుమార్‌ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌కు ఉన్న  క్రేజ్‌ వేరు. ఆర్యలో ‘అ అంటే అమలాపురం’  నుంచి రంగస్థలంలోని ‘జిగేల్‌ రాణి’ వరకూ ఆ మార్క్‌ కనిపిస్తుంటుంది. అందుకే ‘పుష్ప’ ప్రత్యేక గీతాన్ని అలానే ప్లాన్‌ చేశారట. మొదట బాలీవుడ్‌ భామలు దిశా పటానీ, బాహుబలి ఫేమ్‌ నోరా ఫతేహి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. నోరానే చేస్తుందనే టాక్‌ వినిపించినా.. ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో వెనుదిరిగిన మేకర్స్.. చివరి నిమిషంలో ప్రత్యేక గీతానికి సమంతను ఎంపిక చేశారట.

విలన్స్‌గా వీళ్లే.. ఈ ముగ్గురు

హీరో, విలన్‌ ఇలా పాత్ర ఏదైనా వైవిధ్యం చూపించగలిగిన నటుడు విజయ్‌సేతుపతి. ‘ఉప్పెన’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన విజయ్‌నే మొదట భన్వర్‌లాల్‌ షెకావత్‌ పాత్ర చేయాల్సి ఉందట. అప్పటికే వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్‌ డేట్స్‌ సర్దుబాటుకాక చేయలేకపోయారట. దీంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్‌గుప్త, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు కథ వినిపించినా.. పలు కారణాలతో ఆ పాత్ర చేయడానికి వాళ్లు ముందుకు రాలేదు. చివరికి మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌కి కథ నచ్చడంతో ఓకే చేసి.. తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని