
Nagarjuna: సామ్-చై విడాకులు.. ఆవార్తలు నన్ను బాధించాయి: నాగార్జున
హైదరాబాద్: సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత వైవాహిక బంధానికి స్వస్తి పలికి సుమారు మూడు నెలలు అవుతున్నా వారిద్దరి గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. దీంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పలు వార్తలు, వీడియోలు నెట్టింట్లో తెగ పుట్టుకొస్తున్నాయి. వివాహం అనంతరం సమంత బోల్డ్ పాత్రలు చేయడం చైతన్య, నాగార్జునకు నచ్చలేదని.. ఆ విషయంలో అక్కినేని కుటుంబంతో సామ్కు గొడవలు జరిగాయని.. అక్కినేని కుటుంబం సామ్కు ఎన్నో షరతులు పెట్టిందని.. ఇలా ఎన్నో వార్తలు దర్శనమిచ్చాయి.
సామ్-చై విడిపోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి వచ్చిన పలు వార్తలపై నటుడు నాగార్జున తాజాగా స్పందించారు. ప్రస్తుతం ‘బంగార్రాజు’ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా చై-సామ్ విడిపోవడంపై తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘ప్రస్తుతం ఉన్న రోజుల్లో పలువురు కావాలని ఇలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్లో ఇలాంటి వాటికి కొదవే లేదు. నాపై ఇలాంటి అసత్య వార్తలు రాసినా నేను పట్టించుకోలేదు. ‘పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అనే సూక్తిని నేను నమ్ముతాను. అందుకే నా గురించి ఎప్పుడు ఎలాంటి ప్రచారాలు జరిగినా నేను అంతగా పట్టించుకోను. కానీ, నా కుటుంబం గురించి వాళ్లు నెగటివ్గా వార్తలు రాయడం నన్ను ఎంతో బాధించింది’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ అలాంటి వార్తలను తాను పట్టించుకోనని అన్నారు.