Puneeth raj kumar: పునీత్‌ పార్థివదేహం వద్ద బాలయ్య కంటతడి..

తనకెంతో ఆప్తుడైన పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బెంగళూరు చేరుకున్నారు...

Updated : 30 Oct 2021 14:12 IST

బెంగళూరు: తనకెంతో ఆప్తుడైన పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బెంగళూరు చేరుకున్నారు. శనివారం ఉదయం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్‌కు  నివాళులర్పించారు. పునీత్‌ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని పరామర్శించారు. బాలకృష్ణతోపాటు నరేశ్‌, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.

అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘పునీత్‌ మన మధ్య లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. ఆయన మరణ వార్త నన్ను ఎంతగానో కలచివేస్తోంది. రాజ్‌కుమార్‌ కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఒక కళాకారుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్‌ మరణం చూస్తే.. దేవుడు ఎంతో అన్యాయం చేశాడనిపిస్తోంది. నేను నటించిన ‘ఎన్టీఆర్‌’ సినిమా ప్రమోషన్‌కి కూడా పునీత్‌ వచ్చాడు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ బాలయ్య భావోద్వేగానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని