
Chiranjeevi: 154వ చిత్రం షురూ
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా మూడు సినిమాల్ని పట్టాలెక్కించేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిరు 154వ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్లో మొదలైంది. చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ సాగనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ‘ఆచార్య’ని పూర్తి చేసిన చిరంజీవి, ‘గాడ్ఫాదర్’ కోసం కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళాశంకర్’ తొలి షెడ్యూల్ కూడా ఇటీవలే పూర్తయింది.
భోళా... స్టెప్పు అదిరిపోయేలా
మాస్ పాటలో... అందులోనూ టైటిల్ గీతం అంటే చిరంజీవి స్టెప్పుల్లో జోరు మరో స్థాయిలో ఉంటుంది. ‘భోళాశంకర్’ టైటిల్ గీతం కోసం మరోసారి ఆయన అదిరిపోయే స్టెప్పులేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తమన్నా కథానాయిక. చిరుకి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆరంభంలో వచ్చే టైటిల్ గీతాన్ని ఇటీవలే తెరకెక్కించారు. చిరు ఆడిపాడే ఆ పాటకి... శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో రెండు రోజుల కిందటే పాట చిత్రీకరణ పూర్తయిందని సినీ వర్గాలు తెలిపాయి. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూరుస్తున్న సంగతి
తెలిసిందే. డడ్లీ ఛాయాగ్రాహకుడు.