Bollywood: ఈ సినిమాలు ‘షీ’..రోలవి

హీరోయిన్లూ అభిమానులను ఈ విషయంలో ఏమాత్రం నిరాశ పరచడం లేదు. దీంతో హీరోలతో   పాటుగా ‘షీ’..రోలకూ క్రేజ్‌ పెరుగుతోంది.

Published : 15 Jun 2021 12:15 IST

కథానాయిక అంటే.. నాలుగు సీన్లు, పాటలకే పరిమితమనే భావనల్లో మార్పు వస్తోంది. ముఖ్యంగా హీరో డామినేషన్‌ ఉండే బాలీవుడ్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాయికా ప్రధానమైన సినిమాలకు ఆదరణ పెరుగుతుండటమే ఇందుకు స్పష్టమైన రుజువులు. ఓటీటీ వేదికల్లోనూ వీరి హవా స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టర్‌ రిలీజ్‌ నుంచే అంచనాలు పెరుగుతున్నాయ్‌. హీరోయిన్లూ అభిమానులను ఈ విషయంలో ఏమాత్రం నిరాశ పరచడం లేదు. దీంతో హీరోలతో   పాటుగా ‘షీ’..రోలకూ క్రేజ్‌ పెరుగుతోంది. ఆ వరుసలో ఆసక్తి రేపుతున్న కొన్ని సినిమాలివీ!

కంగనా.. తలైవి

వివాదాలతోపాటు విభిన్న పాత్రలకూ కంగనా చిరునామా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తలైవి. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మణికర్ణిక తర్వాత కంగనా నటిస్తున్న సినిమా ఇది. దీంతో పోస్టర్‌ విడుదలైనప్పటినుంచే అంచనాలు పెరిగాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకి తెలుగులో విజయేంద్ర ప్రసాద్‌ రచనా    సహకారం అందిస్తున్నారు. రూ.65 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఓటీటీలో విడుదలవుతుందని వార్తలొచ్చినా చిత్రబృందం వాటిని తోసిపుచ్చింది. జయలలిత 16 నుంచి 60 ఏళ్ల వరకు జీవితాన్ని దీన్ని చూపించనున్నారట. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు.

విద్యాబాలన్‌.. షేర్నీ

థా బలమున్న వాటికి ప్రాధాన్యమిచ్చే నాయికగా విద్యాబాలన్‌కు పేరు. ఇప్పుడు షేర్నీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విద్యా ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. మనుషులను చంపుతున్న పులిని పట్టుకునే బృందానికి ఈమె నాయకురాలు. మహిళ కావడంతో ఆమె పని తీరుపై పై అధికారులు సందేహం వ్యక్తం చేసే  అంశాలతో ట్రైలర్‌ ఆకట్టుకుంది. విద్యా కాస్త విరామం ఇచ్చి వస్తుండటం, ట్రైలర్‌ను చూసేటప్పుడే ధైర్యంగా చూడండని చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. కథ వినగానే తెగ నచ్చేసిందనీ.. విద్యగా తన పాత్రలో భిన్న కోణాలుంటాయనీ విద్య చెబుతోంది. మనిషికీ జంతువుకే కాదు, మనుషుల మధ్యా    పరస్పరం ఉండాల్సిన గౌరవ భావం, అర్థం చేసుకునే తత్వం వంటి సున్నిత అంశాలనూ దీనిలో టచ్‌ చేశారట. ఈ నెల 18న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

గంగూబాయ్‌గా అలియా

భిన్న పాత్రలపై అలియా చాలా త్వరగానే దృష్టిపెట్టింది. తన గత సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.   కెరియర్‌ ప్రారంభంలోని బేబీ డాల్‌ ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేసుకుంది.   ‘కథియవాడ గంగూబాయ్‌’ నిజజీవిత ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌. హుస్సేన్‌ జైదీ   రచించిన ‘మాఫియా క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’ అనే పుస్తకం ఆధారంగా తీస్తున్నారు. కథియవాడకు చెందిన గంగా అనే సాధారణ యువతి గత్యంతరం లేక వ్యభిచారంలోకి అడుగుపెట్టి, అక్కడ్నుంచి గంగూ బాయ్‌గా ఎలా ఎదిగిందన్నది కథ. మహిళా సాధికారతకు ప్రతిరూపంగా ఉంటుందని చెబుతున్నారు. అలియా లుక్, డైలాగ్స్‌ ఆసక్తి కలిగించడానికి ప్రధాన కారణాలు. అజయ్‌ దేవగణ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించడం, సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం అంచనాలను     పెంచేశాయి. జులైలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాప్సీ రెండు బయోపిక్‌లు

హిళా ప్రాధాన్యమున్న సినిమాలకు తాప్సీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమెవి క్రీడా నేపథ్యంలో రెండు సినిమాలు రానున్నాయి. క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత నేపథ్యంలో ‘శభాష్‌ మిథూ’, స్ప్రింటర్‌ రష్మి బయోపిక్‌ ‘రష్మి రాకెట్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొలోజియమ్‌ మీడియా, వయాకామ్‌18 సంయుక్తంగా నిర్వహిస్తున్న శభాష్‌ మిథూకి రాహుల్‌ డొలాఖియా దరకత్వం వహిస్తున్నారు. మిథాలీ పాత్రలో తాప్సీ చక్కగా ఇమిడిందంటూ అభిమానులు తెగ మెచ్చుకున్నారు. పల్లెటూరి అమ్మాయి జాతీయస్థాయి స్పింటర్‌గా   ఎదిగిన వైనం ‘రష్మి రాకెట్‌’లో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తాప్సీ బోలెడు కసరత్తులనూ చేసింది. ఆకర్ష్‌ ఖురానా దీనికి దర్శకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని