Tollywood: వినోదాలు కురిసే... వర్షాకాలం

వేసవి వినోదాలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ‘ఎఫ్‌3’తో ఈ సమ్మర్‌   సీజన్‌కు శుభం కార్డు పడనుంది. అయితే.. ఆ తర్వాతా కొత్త  సినిమాల జోరు ఇదే స్థాయిలో కొనసాగనుంది.

Updated : 22 May 2022 06:57 IST

వేసవి వినోదాలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ‘ఎఫ్‌3’తో ఈ సమ్మర్‌   సీజన్‌కు శుభం కార్డు పడనుంది. అయితే.. ఆ తర్వాతా కొత్త  సినిమాల జోరు ఇదే స్థాయిలో కొనసాగనుంది. వానా కాలంలో సినీప్రియుల్ని వినోదాల జల్లుల్లో తడిపేందుకు పలు క్రేజీ చిత్రాలు సిద్ధమయ్యాయి. వాటిలో ఇప్పటికే కొన్ని చిత్రీకరణలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని సెట్స్‌పై తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

పండగలు.. వేసవి సెలవులు.. సాధారణంగా స్టార్‌ హీరోల దృష్టి ఎప్పుడూ వీటిపైనే ఉంటుంది. తమ చిత్రాల్ని ఈ సెలవుల సీజన్లలోనే బాక్సాఫీస్‌ బరిలో నిలిపేందుకు  ఆసక్తి చూపిస్తుంటారు. ఇక జూన్‌ నుంచి ఆగస్ట్‌ వరకు చిన్న సినిమాలకు దారి వదిలేస్తుంటారు. పిల్లల చదువులు మొదలయ్యేది.. వానలు జోరందుకునేది ఈ నెలల్లోనే కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కాస్త తగ్గుతుంది. అందుకే ఈ మూడు నెలల్లో చిన్న, మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాల సందడే ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈసారి రానున్న మూడు నెలలు స్టార్‌ హీరోల సందడే కనిపించనుంది. ప్రతివారం రెండు మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి.

జూన్‌లో నాలుగు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. 3న కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’తో పాటు అడివి శేష్‌ ‘మేజర్‌’ బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్నాయి. ‘విక్రమ్‌’లో కమల్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ లాంటి స్టార్లు ప్రధాన పాత్రలు  పోషించడం, ‘ఖైదీ’లాంటి హిట్‌ ఇచ్చిన లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించడం, సూర్య అతిథి పాత్రలో సందడి చేయనుండటంతో ఈ సినిమాపై   ప్రేక్షకుల్లో భారీ అంచనాలు     ఏర్పడ్డాయి. ఇక శేష్‌ నటించిన ‘మేజర్‌’పైనా ఇదే స్థాయిలో అంచనాలున్నాయి. దీనికి హీరో మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

జూన్‌ 10న నాని ‘అంటే.. సుందరానికి’ సినిమాతో సందడి చేయనున్నారు. ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్‌ తర్వాత వివేక్‌ ఆత్రేయ నుంచి వస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలోని  ‘‘రాంగో రంగ’’ గీతాన్ని ఈనెల 23న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
జూన్‌ 17న రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో, సత్యదేవ్‌ ‘గాడ్సే’తో బాక్సాఫీస్‌ ముందు రంగంలోకి దిగనున్నారు. వీటిలో ‘రామారావు..’పై మంచి అంచనాలున్నాయి. కొత్త దర్శకుడు శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఇక జూన్‌ 24న కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాతో సందడి చేయనున్నారు.

ఒకటో తేదీ నుంచే జాతర
జులైలో డజను సినిమాలు థియేటర్లకు రానున్నాయి. వాటిలో అరడజనకు పైగా చిత్రాలపై క్రేజ్‌ ఉంది. జులై 1న గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, రానా ‘విరాటపర్వం’, వైష్ణవ్‌ తేజ్‌ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘పక్కా కమర్షియల్‌’ను మారుతి చక్కటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు చేయగా.. ‘విరాటపర్వం’ను విప్లవంతో ముడిపడిన వినూత్నమైన ప్రేమకథతో రూపొందించారు వేణు ఊడుగుల. ఇక ‘రంగ రంగ వైభవంగా’ను కొత్త దర్శకుడు గిరీశాయ తెరకెక్కించారు.
నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందిన ‘థ్యాంక్‌ యూ’ జులై 8న విడుదల కానుంది. ‘మనం’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. చైతన్య మూడు  గెటప్పుల్లో కనిపించనున్నారు.
రామ్‌ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా జులై 14న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే ‘హ్యాపీ బర్త్‌డే’తో థియేటర్లలో సందడి చేయనుంది లావణ్య త్రిపాఠి. ‘మత్తు వదలరా’ ఫేం రితేష్‌ రానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వినూత్నమైన కామెడీ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. జులై 22న నిఖిల్‌ ‘కార్తికేయ 2’, 28న కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’, 29న అడివి శేష్‌ ‘హిట్‌2’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

నెలంతా యాక్షనే
ఆగస్ట్‌లో పాన్‌ ఇండియా చిత్రాల సందడి ఎక్కువగా కనిపించనుంది. వీటితో పాటు పలువురు యువ స్టార్లు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘బింబిసార’ ఆగస్ట్‌ 5న విడుదల కానుంది. చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కించారు దర్శకుడు వశిష్ఠ. ఆగస్ట్‌ 12న సమంత తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’తో పాటు అఖిల్‌ స్పై యాక్షన్‌ సినిమా ‘ఏజెంట్‌’, నితిన్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినీప్రియుల్ని పలకరించనున్నాయి.

ఇక ఆగస్ట్‌ 25న ‘లైగర్‌’గా బాక్సాఫీస్‌ ముందుకు రానున్నారు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందింది. ఇందులో మైక్‌ టైసన్‌ కీలక పాత్రని పోషించడం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని