గహ్లోత్‌కు కొత్త చిక్కు..ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో విలీనం అయిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు స్పీకర్‌ సీపీ జోషి, అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసులు.........

Updated : 30 Jul 2020 19:18 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో విలీనం అయిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు స్పీకర్‌ సీపీ జోషి, అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విలీనంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

2018 ఎన్నికల్లో గహ్లోత్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సాయపడిన ఆరుగురు ఎమ్మెల్యేలు గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తాజాగా ఆ పార్టీ రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదించారు. జాతీయ స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ ఏ పార్టీలోనూ బీఎస్పీ విలీనం కాలేదని చెప్పారు. పార్టీలు తప్ప వ్యక్తులు విలీనం అవ్వడానికి లేదని వాదించారు. ఇప్పటికీ వారు బీఎస్పీకి రాజీనామా చేయలేదని, ఒకవేళ వారు విప్‌ ధిక్కరిస్తే అనర్హత వేటుకు అర్హులని పేర్కొన్నారు.

తాజా పరిణామంతో సీఎం అశోక్‌ గహ్లోత్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. వీలైనంత తొందరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుని సచిన్‌ పైలట్‌ వర్గానికి చెక్‌ పెట్టాలని భావిస్తున్న ఆయనకు.. బీఎస్పీ ఎమ్మెల్యేల రూపంలో కొత్త సమస్య ఎదురైంది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గహ్లోత్‌ చెప్పుకొస్తున్నారు. అందులో వీరు (బీఎస్పీ నుంచి విలీనం అయినవారు) కూడా ఉన్నారు. ఒకవేళ పైలట్‌ వర్గంపై అనర్హత వేటు పడినా.. స్వతంత్రులు, ఇతర పార్టీ మద్దతుతో గట్టెక్కొచ్చని భావించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి వారికి నోటీసులు వెళ్లడం గమనార్హం. 200 సీట్లున్న రాజస్థాన్‌లో సాధారణ మెజార్టీకి 101 సీట్లు అవసరం. ప్రస్తుతం సచిన్‌ పైలట్‌ వర్గంలో ఆయనతో పాటు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా..  ఆర్‌ఎల్పీ (3) సభ్యులతో కలిపి భాజపాకు 75 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరోవైపు ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశ పరిచేందుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాజస్థాన్‌ రాజకీయం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని