రాష్ట్రపతికి తృణమూల్‌ లేఖ

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను పదవి నుంచి తప్పించాలని తృణమూల్‌......

Published : 31 Dec 2020 01:38 IST


గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను పదవి నుంచి తప్పించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన రాజ్యాంగ పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ మీడియాకు తెలిపారు.

ఇటీవల కాలంలో గవర్నర్‌ పాల్పడిన రాజ్యాంగ ఉల్లంఘనలను రాష్ట్రపతి దృష్టికి లేఖ రూపంలో తీసుకెళ్లినట్లు శేఖర్‌రాయ్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 156 క్లాజ్‌ 1 ప్రకారం ఆయనను తొలగించాలని కోరామన్నారు. గతేడాది జులైలో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం ట్వీట్లు, విలేకరుల సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ, కార్యనిర్వాహక వర్గ పనితీరుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మరకు రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పులకు వ్యతిరేకంగా గవర్నర్‌ నడుచుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రపతికి రాసిన లేఖపై రాయ్‌తో పాటు తృణమూల్‌ ఎంపీలు సుదీప్‌ బంధోపాధ్యాయ, కకోలి ఘోష్‌ దస్తిదర్‌, డెరెక్‌ ఓ బ్రెయిన్‌ సంతకం చేశారు. అయితే, రాష్ట్రపతికి తృణమూల్‌ ఎంపీలు లేఖ రాయడాన్ని భాజపా జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గీయ తప్పుబట్టారు. గవర్నర్‌ రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరిస్తున్నారని చెప్పారు. గవర్నర్‌ పనితీరుపై తనకున్న అభిప్రాయం మేరకే  రాష్ట్రపతి నడుచుకుంటారే తప్ప.. ఫిర్యాదుల వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని వర్గీయ పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..
ఆలయాలపై దాడులు.. సీఎం స్పందించరా?
ప్రధానికి రఘురామకృష్ణరాజు లేఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని