తేయాకు తోటల చుట్టూ అసోం రాజకీయాలు

అసోం రాజకీయాలు మరోసారి తేయాకు తోటల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తేయాకు తోటల్లో ఓట్ల వేట సాగిస్తున్నాయి. తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీలు 40 నియోజకవర్గాల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు....

Published : 26 Mar 2021 12:10 IST

కూలీలపై హామీల వర్షం

ఇంటర్నెట్ డెస్క్‌: అసోం రాజకీయాలు మరోసారి తేయాకు తోటల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తేయాకు తోటల్లో ఓట్ల వేట సాగిస్తున్నాయి. తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీలు 40 నియోజకవర్గాల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. అసోం రాష్ట్ర జనాభాలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు 17 శాతం వరకు ఉంటారు. అందుకే ఎన్నికల వేళ అన్ని పార్టీలు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఇటీవల అసోంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తేయాకు తోటల్ని సందర్శించారు. అక్కడి కూలీలతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కాసేపు వారితో కలిసి తేయాకు కూడా కోశారు.

తేయాకు తోటల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తమ దినసరి కూలీ పెంచాలంటూ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీ పెంపుపై హామీలు ఇచ్చే పార్టీలు.. అధికారం చేపట్టాక తమను పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా పనిచేసినా కూడా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. అత్యంత వెనకబాటు జీవితాలను వెల్లదీస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో బతుకుబండిని లాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. పనిచేస్తూ కూడా పస్తులుండాల్సిన దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.

తేయాకు తోటల్లో పనిచేసే కూలీల దయనీయ పరిస్థితులకు మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. 2016లో అనూహ్యంగా అధికారం చేపట్టిన భాజపా తేయాకు తోటల్లో పనిచేసే కూలీల కోసం రూ.3వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ఈ మొత్తం తమకు ఏమాత్రం సరిపోదని కూలీలు పేర్కొంటున్నారు. అసోంలో తిరిగి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఆ కూలీల దినసరి వేతనాన్ని రూ.167 నుంచి రూ.365లకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమకు మళ్లీ అధికారం కట్టబెడతాయని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నా.. ఈ ఎన్నికల్లో అస్సామీలు ఎవరికి జై కొడతారో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని