కేరళలో భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!

కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కేరళకు చెందిన భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను ఉపసంహరించుకుంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ గురువారం అసెంబ్లీలో తీర్మానం పెట్టగా..

Published : 01 Jan 2021 01:20 IST

కొచ్చి: కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కేరళకు చెందిన భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను ఉపసంహరించాలంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ గురువారం అసెంబ్లీలో తీర్మానం పెట్టగా.. భాజపా ఎమ్మెల్యే రాజగోపాల్‌ దానికి మద్దతు పలికారు. దీంతో ఆ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌ ప్రకటించారు. అయితే భాజపా ఎమ్మెల్యే ఈ తీర్మానానికి మద్దతు పలకడంతో కేరళ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 

తీర్మానంపై చర్చ సమయంలో రాజగోపాల్‌ స్పందిస్తూ.. ‘ఈ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసం తెచ్చినవి. రైతులు మధ్యవర్తులతో సంబంధం లేకుండా పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు రైతులకు తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునేందుకు సహకరిస్తాయి. ఈ చట్టాలను వ్యతిరేకించడం అంటే రైతుల ప్రయోజనాలకు అడ్డుపడటమే’ అని పేర్కొన్నారు. ఈవిధంగా మాట్లాడుతూనే... చివరకు  ఓటింగ్‌ సమయంలో తీర్మానానికి మద్దతు పలికారు. 

ఈ క్రమంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్నారా అని మీడియా ఎమ్మెల్యేను ప్రశ్నించగా..‘ప్రజాస్వామ్యంలో అందరం ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. మొండిగా వ్యవహరించకుండా కొన్ని సందర్భాల్లో రాజీపడటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. నేను అందరి ఏకాభిప్రాయంతో వెళ్లే ముందు నా అభిప్రాయాలను ప్రజల ముందు వెల్లడించాను. ఏదేమైనప్పటికీ ఈ తీర్మానాన్ని నేను సమర్థిస్తున్నాను’ అని రాజగోపాల్‌ తెలిపారు. ఇది పార్టీ అధికారిక అభిప్రాయమా అని ప్రశ్నించగా.. పార్టీ నిర్ణయం కాదంటూ బదులిచ్చారు. 

ఇదీ చదవండి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ తీర్మానం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని