
ద్రవ్యోల్బణమా.. తినడం, పెట్రోల్ కొనడం మానేయండి!
ఛత్తీస్గఢ్ భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రాయపూర్: ఒకవైపు పార్టీని దేశమంతా విస్తరింపజేసేందుకు భాజపా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటే.. మరొకవైపు సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాషాయ పార్టీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ద్రవ్యోల్బణం పెరుగుదల జాతీయ విపత్తని భావించేవాళ్లు తినడం.. పెట్రోలు వినియోగించడం మానేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి ఓటు వేసినవారు ఈ పని చేస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుంది’’ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి.
దీంతో బ్రిజ్మోహన్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ద్రవ్యోల్బణాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. అలాంటప్పుడు కాంగ్రెస్ శ్రేణులు తినడం, పెట్రోల్ వాడకం మానేస్తే అది తగ్గుతుందని సరదాగా అన్నాను. అంతేకానీ, ప్రజలందరినీ తినడం, ఇంధనం ఉపయోగించడం మానేయమని చెప్పలేదు’’ అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా బ్రిజ్మోహన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎవరైనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తే దేశం వదిలి వెళ్లిపొమ్మంటారని విమర్శించారు.