CM KCR: పంజాబ్‌ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్‌ రైతులు పోరాడారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 22 May 2022 17:50 IST

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్‌ రైతులు పోరాడారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు దిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌లతో కలిసి కేసీఆర్‌ ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతిచెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందజేస్తామని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. దీనిలో భాగంగానే చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దానికి సంబంధించిన చెక్కులను మృతుల కుటుంబసభ్యులకు అందజేశారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు గొప్ప పోరాటాలు చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన భగత్‌సింగ్‌లాంటి ఎందరో వీరులు ప్రాణాలర్పించి స్వాతంత్ర్యం సాధించారని చెప్పారు. పంజాబ్‌ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. హరిత విప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారని.. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దేశం పరిస్థితి మారలేదని.. రైతుల సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని.. సాగుకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుంటే మీటర్లు పెట్టాలంటోందని విమర్శించారు. భాజపాను ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని