నా ఓఎస్డీపై కఠినచర్యలు తీసుకోండి:సిసోడియా

అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ, ఐఎస్‌ అధికారి గోపాల్‌ కృష్ణ మాధవ్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు...........

Published : 08 Feb 2020 00:25 IST

దిల్లీ: అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ గోపాల్‌ కృష్ణ మాధవ్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కోరారు. మరికొన్ని గంటల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిసోడియా వద్ద ఉన్న అధికారి అవినీతి ఆరోపణల కింద అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన సిసోడియా.. గోపాల్‌ కృష్ణని అరెస్టు చేయడం సమంజసమేనని.. వీలైనంత త్వరగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అతన్ని ఎలాంటి తరుణంలో అరెస్టు చేశారన్న దానిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. లంచం తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

ఓ పన్ను ఎగవేత కేసులో నిందితుల దగ్గరి నుంచి గోపాల్‌ కృష్ణ లంచం తీసుకున్నాడన్న ఆరోపణల కింద సీబీఐ ఆయన్ని గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఈ వ్యవహారంతో సిసోడియాకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలినట్లు సమాచారం. 

మరోవైపు గోపాల్‌ కృష్ణ అరెస్టు నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీపై భాజపా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మాట్లాడుతూ.. మనీష్‌ సిసోడియా తరఫున లంచం తీసుకుంటూ ఓఎస్డీ పట్టుబడ్డారంటూ తీవ్రంగా ఆరోపించారు. ఆప్‌ ప్రభుత్వం లోక్‌పాల్‌ని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. శనివారం దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని