Mamata: 24 గంటలు కాలేదు.. అప్పుడేనా?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు చొప్పు.....

Published : 07 May 2021 01:48 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, సంయుక్త మోర్చాకు చెందిన ఒకరు ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ సమయంలో కూచ్‌బెహార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో మరణించిన ఐదుగురికి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగం ఇస్తామని మమత ప్రకటించారు. అలాగే కాల్పుల ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించిందని, నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా భాజపాపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హింసకు కేంద్రమంత్రులు ఉసిగొల్పుతున్నారంటూ మమత వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 24 గంటలకు కాకముందే లేఖలు, కేంద్ర బృందాలు రాక వంటివి జరిగిపోతున్నాయని అన్నారు. ముందు ఆ పార్టీ నేతలు ప్రజల తీర్పును స్వాగతించడం నేర్చుకోవాలని సూచించారు. భాజపాకు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కొవిడ్‌పై దృష్టి సారించాలనుకుంటున్నామని, తమను పనిచేసుకోనివ్వాలని మమత అన్నారు. జగడాల జోలికి వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని