భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా

అసోంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోక్రఝర్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో వెల్లడించారు.

Updated : 25 Jan 2021 01:25 IST

గువహటి: అసోంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోక్రఝర్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో వెల్లడించారు. ‘కేవలం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే అసోంను అవినీతి, ఉగ్రవాద, కాలుష్య రహితంగా మార్చగలదు. అసోంలో రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పోరాటాలకు ముగింపు పలుకుతూ గతేడాది బోడోలాండ్‌ ప్రాదేశిక ఒప్పందం జరిగింది. గతంలోని ప్రభుత్వాలు కూడా బోడో పోరాట సంఘాలతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యాయి’ అని షా విమర్శించారు.  

‘బీటీఆర్‌ ఒప్పందంలోని అన్ని క్లాజులను నెరవేర్చి.. తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, భాజపాలు కట్టుబడి ఉన్నాయి. భాజపా ప్రభుత్వ హయాంలోనే అసోంలోని అన్ని వర్గాల రాజకీయ హక్కులు, సంస్కృతి, భాష భద్రంగా ఉంటాయి. అన్ని వర్గాల సంస్కృతి, భాష, వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది’ అని షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమిత్‌షా బోడో ప్రాంతంలో రహదారి నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు రూ.500 కోట్లు ప్రకటించారు.  

ప్రధాని నరేంద్ర మోదీ కూడా శనివారం అసోంలో పర్యటించారు. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కాగా బోడోలాండ్‌ డిమాండ్‌తో దశాబ్దాలుగా హింసాత్మక మార్గంలో పోరాటాలు చేస్తున్న బోడోలాండ్‌ ప్రజాస్వామ్య కూటమి సహా పలు సంఘాలతో అసోం ప్రభుత్వం గతేడాది కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

జీడీపీ బ్రహ్మాండం.. ప్రభుత్వంపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని