సరిహద్దులో..యథాతథస్థితి లేకుంటే శాంతి కష్టమే!

భారత్‌-చైనా సరిహద్దులో ఇంతకుముందున్న స్థితి లేకుంటే శాంతి, ప్రశాంత వాతావరణము లేనట్లేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 11 Feb 2021 18:30 IST

బలగాల ఉపసంహరణపై రాహుల్‌ గాంధీ

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో ఇంతకుముందున్న యథాతథస్థితి లేకుంటే శాంతి, ప్రశాంత వాతావరణమూ లేనట్లేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సైనికుల త్యాగాలను ఎందుకు అవమాన పరుస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, భారత భూభాగాన్ని వదిలేస్తోందని విమర్శించారు. బలగాల ఉపసంహరణపై చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో వెల్లడించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు.

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. రెండు దేశాలు కూడా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపు 50వేల చొప్పున సైనికులను మోహరించినట్లు సమాచారం. దీంతో గతకొంతకాలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పలు దఫాల్లో సైనికాధికారులు, విదేశాంగశాఖ చర్చల ఫలితంగా తాజాగా ఇరు దేశాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాయి. దఫాల వారీగా సరిహద్దుల్లో బలగాలు వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని.. చైనాకు అంగుళం భూమి కూడా వదిలేది లేదని పార్లమెంట్‌ వేదికగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కూడా ఇప్పటికే స్పందించింది.

ఇవీ చదవండి..
చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం
గల్వాన్‌లో 45మంది చైనా జవాన్ల మృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని