
TS News: రైతులను ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం: రేవంత్రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మిర్చి పంట బాగా పండితే ఎకరాకు రూ.3.50లక్షల ఆదాయం వస్తోందని ఆశపడిన రైతులు ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టారన్నారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులు, అధికారులను పంపించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రేవంత్రెడ్డి తెలిపారు.