TS News: కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరాశ చెందొద్దు: రేవంత్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈనేపథ్యంలో ఉప ఎన్నక ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు

Updated : 02 Nov 2021 19:50 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈనేపథ్యంలో ఉప ఎన్నిక ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కార్యకర్తలను ఎంతో నిరాశకు గురిచేశాయి. అయినా, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్‌ను నిర్ధారించలేవు, నిర్ణయించలేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రత్యేక మైన పరిస్థితిల్లో జరిగింది. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బల్మూరి వెంకట్‌ గ్రామ.. గ్రామం తిరిగి ఓటర్లను కలిశారు. భవిష్యత్‌లో వెంకట్‌ మంచి నాయకుడు అవుతారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు.. ఓడిపోతే కుంగిపోయేది లేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలకు సంపూర్ణ బాధ్యత నాదే. భవిష్యత్‌లో ఇంకా నిబద్ధతతో, పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కొట్లాడతా. ఉప ఎన్నిక ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి.. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ధారించుకుని ముందుకెళ్తాం. కాంగ్రెస్‌ శ్రేణులు ఎవరూ నిరుత్సాహపడొద్దు. ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకు ఉన్నాయి. ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్‌లో వారిని నూటికి నూరుశాతం కాపాడుకుంటాం. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపాకు 1673 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఉప ఎన్నికలో ఆ పార్టీ నెగ్గింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్‌ ఎన్నికలో భాజపా డిపాజిట్‌ కోల్పోయింది. అంత మాత్రాన ఆపార్టీ మూసేసింది లేదు.. మిగతా పార్టీలు 10అంతస్తుల బంగ్లాలు కట్టింది లేదు. కార్యకర్తలకు అండగా నేనుంటా.. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాడుదాం’’ అని రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని