Devendra Fadnavis: మా పార్టీ గుర్తుపై శివసేన పోటీ చేసి, మర్చిపోయింది..!

భాజపాతో పొత్తు పెట్టుకొని శివసేన పార్టీ పాతికేళ్ల సమయం వృథా చేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేయగా.. వాటిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ దీటుగా తిప్పికొట్టారు.

Published : 25 Jan 2022 01:04 IST

ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్‌

ముంబయి: భాజపాతో పొత్తు పెట్టుకొని శివసేన పార్టీ పాతికేళ్ల సమయం వృథా చేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేయగా.. వాటిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ దీటుగా తిప్పికొట్టారు. ‘ఉద్ధవ్‌ చరిత్ర మర్చిపోయారు. శివసేన 25 సంవత్సరాలు వృథా చేసిందని అన్నారు. కానీ 2012 వరకు ఈ కూటమికి బాలాసాహేబ్ నాయకుడన్న విషయం ఆయన మర్చిపోయారు. ఈ వ్యాఖ్యలు.. బాలాసాహేబ్ కూటమిలో కొనసాగాలన్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి’ అని ఫడణవీస్ దుయ్యబట్టారు. 

‘అలాగే ఆయనకు మరో విషయం గుర్తుచేస్తున్నాను. శివసేన పార్టీ మనుగడలోకి రాకముందు భాజపాకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు. భాజపా గుర్తుపైనే సేన ఒక లోక్‌సభ ఎన్నికలో పోటీ చేసింది. ఆ పార్టీకి చెందిన మొదటి ముఖ్యమంత్రి మనోహర్ జోషి.. మా గుర్తుపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వారు భాజపాతో ఉన్నప్పుడు రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయారు. ఆయన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు. హిందుత్వ గురించి మాట్లాడేందుకు, రామమందిర అంశాన్ని లేవనెత్తేందుకు భాజపా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. రామమందిరం కోసం మోదీజీ చేసిన కృషిని ఆ పార్టీ మర్చిపోయింది’ అని విమర్శలు చేశారు. అలాగే ఆర్టికల్ 370పై ఉద్ధవ్‌ ఏ వైఖరి తీసుకోలేదని మండిపడ్డారు. ఆయన ఇకనైనా హిందుత్వ గురించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్‌ ఠాక్రే వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘భాజపా రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో చాలా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అందులో శివసేన కూడా ఉంది. అధికారంలోకి వచ్చి హిందుత్వ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతోనే మేం గతంలో భాజపాతో చేతులు కలిపాం. అంతేగానీ, అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదు. కానీ, భాజపా మాత్రం అధికారం కోసం పాకులాడుతూ హిందుత్వ అవకాశవాదిగా మారింది. అందుకే ఆ పార్టీ నుంచి విడిపోయాం. భాజపాతో పొత్తు పెట్టుకుని శివసేన 25ఏళ్ల సమయం వృథా చేసుకుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ అమిత్ షా చేసిన సవాలును తాను స్వీకరిస్తున్నట్లు ఠాక్రే వెల్లడించారు. శివసేనను మహారాష్ట్ర వెలుపలా విస్తరిస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని