నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి తప్పదు!

బెంగాల్‌లో కీలకమైన నందిగ్రామ్‌ స్థానం నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి సువేందు అధికారి తాజాగా నందిగ్రామ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 13 Mar 2021 13:35 IST

భాజపా అభ్యర్థి సువేందు అధికారి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కీలక స్థానమైన నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 10తేదీన నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అదే స్థానం నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి సువేందు అధికారి తాజాగా నందిగ్రామ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, నందిగ్రామ్‌ ప్రజల మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని.. మమతా బెనర్జీకి ఇక్కడ ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు.

‘నందిగ్రామ్‌ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉంది. మమతా బెనర్జీకి కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నందిగ్రామ్‌ ప్రజలు గుర్తోస్తారు. అందుకే మమతా బెనర్జీని ఇక్కడి ప్రజలు ఓడిస్తారు. ఇదే అసెంబ్లీ స్థానంలో ఓటరుగా ఉన్న నాకు ప్రజల మద్దతు బలంగా ఉంది’ అని నామినేషన్‌ వేసిన సందర్భంగా సువేందు అధికారి పేర్కొన్నారు. ఇక ఇదే స్థానం నుంచి పోటీ చేస్తోన్న మమతా బెనర్జీ 50వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. కాలి మడమకు గాయం కావడంతో మమతా బెనర్జీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, 2016లో సువేందు తృణమూల్‌ తరఫున నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సువేందు తండ్రి, అన్నయ్య కూడా ఎంపీలుగా ఉన్నారు. ఈ ప్రాంతంలోని దాదాపు 40 అసెంబ్లీ సీట్లను అధికారి కుటుంబం ప్రభావితం చేస్తుందంటారు. అలాంటి సువేందు తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో సువేందును ఓడించేందుకు మమత రంగంలోకి దిగారు. దీంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా భాజపా సైతం సువేందును బరిలో నిలిపి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొనేలా చేసింది. మార్చి 27 నుంచి సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో 294 స్థానాలకు బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ ఒకటిన నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని