Kodali Nani: భాజపాతో పొత్తా.. పవన్‌కు సిగ్గులేదా?: కొడాలి నాని

బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాకు 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని.. భాజపాకు ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Updated : 09 Nov 2021 15:48 IST

అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాకు 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని.. భాజపాకు ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘భాజపాపై పెట్రోల్‌.. తెదేపాపై డీజిల్‌ పోసి జనం తగులబెట్టారు. జనసేన పలికిమాలిన పార్టీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు పవన్‌ కల్యాణ్‌కు సిగ్గు లేదా? పశ్చిమ్‌బెంగాల్‌లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లోనూ భాజపాను ఓడించారు. అధికారం ఉన్న చోట.. లేని చోటా ఆ పార్టీ చిత్తుగా ఓడింది. జగన్‌ మేక, నక్క కాదు.. పులివెందుల పులి. గల్లీలో ఉన్న సిల్లీ భాజపా నాయకులు ఆయన్ను ఏమీ చేయలేరు. పార్టీలో ఉండి సర్వనాశనం అవుతున్నామని కేంద్రానికి చెప్పండి.

ఆ మూడు పార్టీలూ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి..

ప్రజా సమస్యల పేరుతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలట. అఖిలపక్ష భేటీ పేరుతో వీళ్లకి అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలట. వారంలో అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని జగన్‌కు వార్నింగ్‌ ఇస్తున్నారు. మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం జగన్‌ రావాలి. అఖిలపక్షంలో చంద్రబాబు, పవన్‌ దూరి దిల్లీ వస్తామంటారు. వ్యక్తిగతంగా మాట్లాడాలని కాళ్లు పట్టుకుంటారు. పొత్తులు, రాజకీయాల గురించి మాట్లాడాలని యత్నిస్తున్నారు. ఆ మూడు పార్టీలూ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మీ రాజకీయ అవసరాల కోసం కేంద్రం వద్దకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు. 

పెట్రోల్‌ ధరలు మేమెందుకు తగ్గించాలి?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కేంద్రానికి సంబంధించిన అంశం. పెట్రో ధరలు తగ్గిస్తే కేంద్రమే తగ్గించాలి. మేం పన్నులు పెంచలేదు.. మేమెందుకు తగ్గిస్తాం?రూ.60 ఉన్న పెట్రోల్‌ను రూ.110 చేసింది భాజపానే. తగ్గించాల్సిన బాధ్యత కూడా భాజపాదే. మేం దోచుకుంటాం.. మీరు తగ్గించుకోండి అంటే ఎలా?వ్యాట్‌ తగ్గిస్తే రాష్ట్రం కోల్పోయే ఆదాయం కేంద్రం ఇస్తుందా?పెట్రో ధరలపై వచ్చే సొమ్మును కేంద్రం భాజపా పాలిత రాష్ట్రాలకు పంచుతోంది. చంద్రబాబు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఫలితం ఉంటుంది’’ అని కొడాలి నాని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని