ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది అతడే..

టీమ్‌ఇండియా క్రికెట్‌లో మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే విషయం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది...

Published : 21 Aug 2020 14:46 IST

పూర్తిస్థాయి వికెట్‌ కీపర్‌ ఎవరో చెప్పిన ఆకాశ్‌చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే విషయం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై అటు క్రికెట్‌ వర్గాల్లో ఇటు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జట్టుకు కీపర్‌గా వ్యవహరించే క్రమంలో రిషభ్‌పంత్‌ గతేడాది విఫలమవ్వగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ ఏడాది ఆరంభంలో కేఎల్‌ రాహుల్‌ ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. దీంతో అందరి కళ్లూ ఇప్పుడు అతగాడిపై పడ్డాయి. కానీ, టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే అతడు 50 ఓవర్ల పాటు కీపింగ్‌ చేయడం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందించాడు. 

తొలుత సాహా పేరు ప్రస్తావించిన చోప్రా.. కేవలం టెస్టుల వరకే పనికొస్తాడని చెప్పాడు. 2014లో మాజీ సారథి టెస్టుల నుంచి తప్పుకున్నాక బెంగాల్‌ కీపర్‌ ఆ బాధ్యతలను స్వీకరించాడని గుర్తుచేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయానికొస్తే ఇద్దరు ఉన్నారని.. వారే కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ అని పేర్కొన్నాడు. వీళ్లిద్దరు కాకుండా భవిష్యత్‌లో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ కూడా ఉన్నారన్నాడు. ‘కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గానే కొనసాగుతాడు.. కీపర్‌గా కాదు. ఎందుకంటే 50 ఓవర్ల పాటు కీపింగ్‌ చేసి మళ్లీ ఓపెనర్‌గా దిగడమనేది చాలా కష్టం. కాబట్టి పంతే తొలి ప్రాధాన్యం. అతడి తర్వాత శాంసన్‌, ఇషాన్‌’ అని చోప్రా వివరించాడు.

అనంతరం మరో అభిమాని ‘ఈసారి ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్‌ పెయిర్?’ ఎవరని అడగ్గా.. ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ-క్వింటన్‌ డికాక్‌ లేదా రోహిత్‌-క్రిస్‌లిన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌-జానీ బెయిర్‌స్టో, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు చెందిన క్రిస్‌గేల్-కేఎల్‌ రాహుల్‌ జోడీ పేర్లను వెల్లడించాడు. చివరగా మరో అభిమాని ఇంకో ప్రశ్న సంధించాడు. ఆర్సీబీలో ఈసారి ఎక్స్‌ ఫాక్టర్‌ (కీలక) ఆటగాడు ఎవరని అడ్గా.. మోయిన్‌ అలీ పేరును వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని