కొవిడ్‌ యోధులకు  దిల్లీ ‘సలామ్‌’

కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న కొవిడ్‌ యోధులకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అండగా నిలుస్తున్నాయి. ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారిని సముచిత రీతిలో గౌరవిస్తున్నాయి. ‘మై కొవిడ్‌ హీరోస్‌’ అని ముద్రించిన జెర్సీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటికే ఆవిష్కరించింది....

Published : 18 Sep 2020 23:44 IST

దుబాయ్‌: కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న కొవిడ్‌ యోధులకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అండగా నిలుస్తున్నాయి. ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారిని సముచిత రీతిలో గౌరవిస్తున్నాయి. ‘మై కొవిడ్‌ హీరోస్‌’ అని ముద్రించిన జెర్సీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటికే ఆవిష్కరించింది. దిల్లీ క్యాపిటల్స్‌ సైతం అదే బాటలో నడుస్తోంది. ‘కొవిడ్‌ యోధులకు కృతజ్ఞతలు’ అని రాసున్న జెర్సీలనే లీగ్‌ మొత్తం ఉపయోగించనుంది. ‘సలామ్‌ దిల్లీ’ అనే కార్యక్రమంలో భాగంగా ఇదంతా చేస్తోంది.

కొవిడ్‌ యోధులతో దిల్లీ క్యాపిటల్స్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. వారి సేవలను కొనియాడింది. ప్రస్తుత తరుణంలో వారు చేస్తున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలని కోరింది. వారిని గౌరవించాలన్న ఉద్దేశంతో ‘కొవిడ్‌ యోధులకు కృతజ్ఞతలు’ అని రాసున్న జెర్సీలను ఆవిష్కరింపజేసింది. ‘పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, భద్రతా సిబ్బంది, రక్తదాతలు, సామాజిక కార్యకర్తలు, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు’ అని దిల్లీ ఓ ప్రకటనలో తెలిపింది.

‘ఈ కొవిడ్‌ యోధులకు ధన్యవాదాలు తెలియజేయాలంటే మాటలు సరిపోవు. మా అందరి తరఫున మీకు పెద్ద సలామ్‌. మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్న వేళ మీ సేవలతో అందరికీ ప్రేరణనిస్తున్నారు. మీరిలాగే ముందుకు సాగాలి’ అని సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ప్రశంసించాడు. ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని