ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో.........

Updated : 07 Dec 2022 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌ కప్‌ అందించారు. మెరుపు గోల్స్‌ కొడుతూ ఫుట్‌బాల్‌ ఆటలో ‘ది గోల్డెన్‌ బాయ్‌’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన ప్రపంచస్థాయి కీర్తి గడించారు.

నాలుగు సార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్‌‌లు ఆడారు. 1991లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఆయన 15నెలల పాటు ఆట నుంచి నిషేధానికి గురయ్యారు. అలా.. అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీకి కూడా దూరమయ్యారు. 1997లో ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. 2004లో శ్వాసకోశ, హృద్రోగ సమస్యల బారినపడ్డారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు.  యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గానూ పనిచేశారు. 

డీగో.. నీ టాలెంట్ సూపర్‌.. వీడియో 

చూసేందుకు ఆయనేమీ ఆజానుబాహుడు కాదు. భారీగా శారీరక ధారుడ్యం కలిగినవాడూ కాదు. అయితేనేమీ ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తన ఫుట్‌బాల్‌ ఆటతో. ఆయనే అర్జెంటీనాకు చెందిన డీగో అర్మాండో మారడోనా.  ప్రతి ఫుట్‌బాల్‌ అభిమానికి డీగో పేరు తెలియకుండా ఉండదు. అప్పట్లో మారడోనా మైదానంలోకి దిగాడంటే ఒకటే కేరింతలు.. ప్రత్యర్థులకు అందకుండా గోల్‌ కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దిగ్గజ ఆటగాడు. అక్టోబర్‌ 30న 60వ వసంతంలోకి అడుగు పెట్టిన ఆయన అంతలోనే అస్తమయం కావడం యావత్‌ ప్రపంచ క్రీడాభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల ఆయన 60వ పుట్టిన రోజు సందర్భంగా వైరల్‌ అయిన వీడియో ఇది. 1989వ సంవత్సరంలో మారడోనా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. బంతిని ఎంతో నేర్పుగా ఒడిసి పడుతున్న వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని