ముంబయి హ్యాట్రిక్‌

ముంబయి సేన మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6)

Updated : 07 Oct 2020 04:21 IST

57 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి సేన మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టును బుమ్రా (4/20) దెబ్బతీశాడు. బట్లర్‌ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) పోరాడాడు. ఈ గెలుపుతో రోహిత్‌సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ సీజన్‌లో ముంబయికి ఇది వరుసగా మూడో విజయం.

బట్లర్‌ ఒక్కడే..

ఛేదనలో బట్లర్ మినహా ఎవరూ పోరాడలేపోయారు. ముంబయి పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్‌, సంజు శాంసన్‌ డకౌటవ్వగా.. స్మిత్‌ ఆరు పరుగులకు ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లొమ్రార్‌ (11; 13 బంతుల్లో, 1×4)తో కలిసి బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే లొమ్రార్‌ను రాహుల్ చాహర్‌ (1/24) బోల్తా కొట్టించాడు. అనంతరం బట్లర్ గేర్‌ మార్చి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తొలి 24 బంతుల్లో అతడు 24 పరుగులే చేశాడు. తర్వాత సిక్సర్లతో స్కోరుబోర్డును ముందుకు నడింపించాడు. అయితే పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌కు ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఆఖర్లో ఆర్చర్‌ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించింది. ముంబయి బౌలర్లలో బుమ్రా (4/20), బౌల్ట్‌ (2/26), ప్యాటిన్సన్‌ (2/19) రాణించారు.

అదరగొట్టిన సూర్యకుమార్‌
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్‌ శర్మ (35; 23 బంతుల్లో, 2×4, 3×6), డికాక్‌ (23; 15 బంతుల్లో, 3×4,1×6) బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ త్యాగి (1/36)..5వ ఓవర్‌లో డికాక్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ (0)ను వరుస బంతుల్లో శ్రేయస్‌ గోపాల్ (2/28) పెవిలియన్‌కు పంపించి ఆ జట్టును దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (12; 17 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. మరోవైపు సూర్యకుమార్ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రాజస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న హార్దిక్‌ పాండ్య (30*; 19 బంతుల్లో 2×4, 1×6) ఆశించిన రీతిలో చెలరేగలేకపోయాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని