INDvsENG: బౌలర్లు మెరిసిన వేళ.. ఇండియా అద్భుత విజయం 

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ అద్భుతం చేసింది. చివరిరోజు టీమ్‌ఇండియా పేసర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు...

Updated : 16 Aug 2021 23:50 IST

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ అద్భుతం చేసింది. చివరిరోజు టీమ్‌ఇండియా పేసర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల ఘన విజయం అందించారు. దాంతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదుచేశారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. సిరాజ్‌ 4/32, బుమ్రా 3/33, ఇషాంత్ 2/13 రాణించడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ జోరూట్‌(33; 60 బంతుల్లో 5x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్‌(25; 96 బంతుల్లో 3x4), రాబిన్‌సన్‌(9; 35 బంతుల్లో) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బుమ్రా, సిరాజ్‌ అడ్డుకట్ట వేశారు.

 అంతకుముందు టీమ్‌ఇండియా 181/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం ఐదోరోజు ఆటను ప్రారంభించగా.. మహ్మద్‌ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6x4, 1x6), జస్ప్రిత్‌ బుమ్రా (34 నాటౌట్‌; 64 బంతుల్లో 3x4) బ్యాటింగ్‌లోనూ అద్భుతం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో తొలి సెషన్‌లో భారత్‌ను ఆలౌట్‌ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించాలని అనుకున్న ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చివరిరోజు జట్టును ఆదుకుంటాడని భావించిన రిషభ్ పంత్‌ (22; 46 బంతుల్లో 1×4) త్వరగానే పెవిలియన్‌ చేరాడు. రాబిన్సన్‌ వేసిన 85.3వ ఓవర్‌కు కీపర్‌ జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్‌ శర్మ (16; 24 బంతుల్లో 2×4) సైతం రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం జోడీ కట్టిన షమి, బుమ్రా.. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్‌ తీస్తూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం సంపాదించాక జట్టు స్కోర్‌ 298/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోయింది. టీమ్‌ఇండియా పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే చివరికి అద్భుత విజయం సాధించారు.

కాగా, ఈ విజయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భారత జట్టుకు మ్యాచ్‌ గెలిచిన వెంటనే అభినందించారు. ఉత్కంఠ పోరులో భారత్‌ అద్భుత విజయం సాధించిందని ట్విటర్‌లో కొనియాడారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌; రాహుల్‌ 129, అండర్సన్‌ 5 వికెట్లు

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391 ఆలౌట్‌; జో రూట్‌ 180 నాటౌట్‌, సిరాజ్‌ 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 298/8 డిక్లేర్‌; అజింక్య రహానె 61, మార్క్‌వుడ్‌ 3 వికెట్లు

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 120 ఆలౌట్‌; జో రూట్‌ 33, సిరాజ్‌ 4 వికెట్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని