2006లోనే రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చాడు: లక్ష్మణ్‌

కెప్టెన్‌ కూల్‌గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ అంతే కూల్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్‌ఇండియాకు...

Updated : 17 Aug 2020 11:52 IST

మా అందరినీ కూర్చోబెట్టుకొని బస్సులో తీసుకెళ్లాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్‌ కూల్‌గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ అంతే కూల్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని మాట్లాడుతున్నారు. అయితే, తాను ఆడే రోజుల్లో మహీలోని మరో కోణాన్ని చూశానని చెప్పాడు హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌. మాజీ సారథి రిటైర్మెంట్‌ అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌ ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ కార్యక్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌తో మాట్లాడుతూ రెండు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోనీ చేసిన ఆ రెండు విశేషాలు తానెప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు. 

ధోనీ 2006లో పాకిస్థాన్‌పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్‌పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ నివ్వెరపరిచాడని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ‘‘పాక్‌ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో మహీ ఈ ఫార్మాట్‌లో తొలి శతకం బాదాడు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి గట్టిగా ఇలా అరిచాడు. ‘నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఎంఎస్‌ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్‌లో ఇంతకుమించి నాకేం వద్దు’ అని చెప్పాడు. మేమంతా ఒక్కసారిగా అలా చూస్తుండిపోయాం’’ అని వీవీఎస్‌ వివరించాడు. అలాగే మరోసారి టీమ్‌ఇండియా సారథిగా ఉన్నప్పుడూ జట్టు మొత్తాన్ని అయోమయానికి గురిచేశాడని చెప్పాడు. 2008లో నాగ్‌పూర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేటప్పుడు ఒక రోజు మైదానం నుంచి హోటల్‌ వరకు బస్సును నడిపాడని చెప్పాడు. డ్రైవర్‌ను వెనక్కి వెళ్లమని చెప్పి అందరినీ తీసుకొని హోటల్‌ వరకు తీసుకెళ్లాడని వివరించాడు. ధోనీ అంటే అంతగా కలిసిపోతాడని, బయట జీవితాన్ని సరదాగా గడుపుతాడని పేర్కొన్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని