T20 World Cup: పాకిస్థాన్కు షాక్.. ఫైనల్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్థాన్కు షాక్. ఈ మెగా టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర చేస్తున్న పాకిస్థాన్కు ఆస్ట్రేలియా అడ్డుకట్టవేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో నెగ్గి సెమీస్కు చేరిన పాక్కు రెండో సెమీ ఫైనల్లో ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. డేవిడ్ వార్నర్ (49; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), మార్కస్ స్టాయినిస్ (40; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్ (41; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్లో వేడ్ చివరి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టినా ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా విజయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ వేడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
సిక్సర్లతో విరుచుకుపడ్డ వేడ్..
177 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0)ని షాహీన్ ఆఫ్రిది వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (28)తో వార్నర్ జతకట్టాడు. మార్ష్ కాస్త నెమ్మదిగా ఆడినా వార్నర్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇమాద్ వసీమ్ వేసిన 4 ఓవర్లో వార్నర్ ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్లో మార్ష్ సిక్స్, ఫోర్ బాదాడు. షాదాబ్ఖాన్ వేసినా ఏడో ఓవర్లో మిచెల్ మార్ష్.. అసిఫ్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన స్మిత్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కొద్దిసేపటికే వార్నర్, మ్యాక్స్వెల్ (7) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. తర్వాత స్కోరు నెమ్మదించింది. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకున్న మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్ గేర్లు మార్చి ఆడారు. ముఖ్యంగా వేడ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హసన్ అలీ వేసిన 18 ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన అతడు.. షాహీన్ వేసిన 19 ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో చివరి మూడు బంతులకు మూడు సిక్స్లు కొట్టి జట్టును ఫైనల్కు చేర్చాడు.
అదిరే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాకిస్థాన్కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (67; 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), బాబర్ అజామ్(39 : 34 బంతుల్లో 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్వెల్ వేసిన మూడో ఓవర్లో చెరో ఫోర్ కొట్టగా.. హేజిల్వుడ్ వేసిన ఐదో ఓవర్లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్లో చివరి బంతికి బాబర్ అజామ్.. వార్నర్కి చిక్కాడు. అనంతరం ఫకార్ జమాన్(55; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు)తో జట్టు కట్టిన రిజ్వాన్ జోరు పెంచాడు. జంపా వేసిన వేసిన 12 ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్వుడ్ వేసిన 17వ ఓవర్లో రిజ్వాన్ ఫోర్, సిక్సర్ బాదగా.. జమాన్ కూడా సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో రిజ్వాన్.. స్మిత్కి చిక్కాడు. అయితే జమాన్ ఏ మాత్రం జోరు తగ్గించలేదు. అదే ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్లో అసిఫ్ అలీ (0), చివరి ఓవర్లో షోయబ్ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్లో ఫకార్ జమాన్ రెండు సిక్స్లు బాదడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్, జంపా తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.