IND vs SL: సిరీసుపై ‘కొవిడ్‌’ మబ్బులు!

శ్రీలంకలో భారత జట్టు పర్యటనపై కొవిడ్‌ మబ్బులు కమ్ముకుంటున్నాయి! రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లపై....

Published : 15 May 2021 14:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకలో భారత జట్టు పర్యటనపై కొవిడ్‌ మబ్బులు కమ్ముకుంటున్నాయి! రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లపై సందిగ్ధం నెలకొంది. లంకలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం.

గురువారం లంక 3,269 కేసులు, 24 మరణాలను నివేదించింది. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16,343, మరణాలు 147కు చేరుకున్నాయి. మెల్లగా కరోనా రెండో వేవ్‌ ప్రభావం అక్కడ పెరుగుతోంది. వైరస్‌ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక×భారత్‌ సిరీసును ఇప్పటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

‘పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ గతేడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌, ఇతర సిరీసులను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు భారత్‌తో సిరీసునూ అలాగే నిర్వహిస్తామన్న నమ్మకం ఉంది. ఏదేమైనా కేసులు పెరగకూడదని కోరుకుంటున్నాం’ అని శ్రీలంక క్రికెట్‌ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

మరికొన్ని రోజుల్లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి వంటి సీనియర్లతో కూడిన భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు ఆడనుంది. అదే సమయంలో తెల్ల బంతి స్పెషలిస్టులు శ్రీలంకలో పర్యటిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్, యూజీ, సంజు, పృథ్వీషా, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియా వంటి కుర్రాళ్లతో కూడి జట్టు లంకలో పర్యటించనుంది. 3 వన్డేలు, 3 టీ20లకు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు