Delhi vs Mumbai: పోరు దిల్లీ, ముంబయిది.. ఉత్కంఠ బెంగళూరుది..!

భారత టీ20 టోర్నీలో లీగ్‌ దశ చివరి మజిలీకి చేరింది. అందరూ ఊహించినట్లే ఇన్ని రోజులూ టాప్‌లో కొనసాగిన గుజరాత్‌, రాజస్థాన్‌, లఖ్‌నవూ జట్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి...

Updated : 21 May 2022 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారత టీ20 టోర్నీలో లీగ్‌ దశ చివరి మజిలీకి చేరింది. అందరూ ఊహించినట్లే ఇన్ని రోజులూ టాప్‌లో కొనసాగిన గుజరాత్‌, రాజస్థాన్‌, లఖ్‌నవూ జట్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసమే దిల్లీ, బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. ఆ ఉత్కంఠకు కూడా ఈరోజు రాత్రి దిల్లీ, ముంబయి జట్ల మధ్య జరిగే పోరుతో తెరపడనుంది.

లీగ్‌ దశలో భాగంగా మొత్తం 70 మ్యాచ్‌లు ఆడుతుండగా.. ఇప్పటికే 68 ఆటలు పూర్తయ్యాయి. ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలాయి. అయితే, ఈరోజు దిల్లీ విజయం సాధిస్తే నాలుగో బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే బెంగళూరు ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాబ్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ నామమాత్రం కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈరోజు జరిగే మ్యాచ్‌పైనే పడింది. ఈ టోర్నీలో అన్ని జట్ల కన్నా ముందే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి పదో స్థానంలోనే నిలిచింది. అలాంటి జట్టు ఇప్పుడు ఐదో స్థానంలో ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతున్న దిల్లీని ఏమాత్రం కట్టడి చేస్తుందో చూడాలి. అయితే, ఈ పోరులో ముంబయి విజయం సాధించాలని, అటు బెంగళూరు, ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

రెండు సమానంగా..

ఈ సీజన్‌లో ముంబయి ఎంత దారుణంగా ఆడినా గత ఐదు మ్యాచ్‌ల్లో దిల్లీ మాదిరే మూడు విజయాలు, రెండు ఓటములతో నిలిచింది. అంటే ఈ లెక్కన ప్రస్తుతం రెండు జట్లూ ఇంచుమించు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కానీ, దిల్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోదనేది కాదనలేని సత్యం. మరోవైపు ముంబయి ఈ సీజన్‌లో కేవలం మూడు విజయాలే సాధించడంతో చివరి మ్యాచ్‌లోనైనా గెలుపొంది కనీసం తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై మాదిరే కాస్త గౌరవప్రదంగా తిరుగుముఖం పట్టాలని చూస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

దిల్లీని వార్నరే ఆదుకోవాలి..

ఈ సీజన్‌ ఆరంభం నుంచి గెలుపోటములతో దాగుడుమూతలు ఆడుతూ ఇక్కడిదాకా చేరుకున్న దిల్లీ గత రెండు మ్యాచ్‌ల్లోనే వరుసగా విజయాలు సాధించడం గమనార్హం. అయితే, రోహిత్ టీమ్‌ బౌలర్లు సరిగ్గా బౌలింగ్‌ చేస్తే.. దిల్లీని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రస్తుతం ఆ జట్టులో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (427) ఒక్కడే రాణిస్తున్నాడు. అతడు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 అర్ధ శతకాలతో.. 53.38 మంచి సగటుతో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ 13 మ్యాచ్‌ల్లో (301) పరుగులతో ఏమంత ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఇప్పటివరకు ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (259) కాస్త ఫరవాలేదనిపించినా అనారోగ్యంతో ఇప్పుడు తుదిజట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక విదేశీ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌ (251), రోమన్‌ పావెల్‌ (207) కూడా పెద్ద ప్రమాదకరంగా కనిపించడం లేదు. దీంతో టాప్‌ ఆర్డర్‌లో వార్నర్‌ను కట్టడి చేస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లే. దిల్లీ బౌలింగ్‌లో కుల్‌దీప్‌ (20), ఖలీల్‌ అహ్మద్‌ (16) పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు పడగొడుతున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ (13) తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.

ముంబయిలో రోహిత్‌ మెరవాలి..

ఇక ముంబయి బ్యాటింగ్‌ విషయానికి వస్తే ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ సీజన్‌ ఆరంభంలో విఫలమైనా ఇటీవల కాస్త మెరుగైనట్లు కనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై తొలి వికెట్‌కు వీరిద్దరు 95 పరుగులు జోడించారు. అదే జోరును ఈరోజు కూడా కొనసాగిస్తే దిల్లీకి కష్టాలు తప్పకపోవచ్చు. ఇషాన్‌ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయగా మూడు అర్ధశతకాలు సాధించాడు. అలాగే యువ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ కూడా అన్ని మ్యాచ్‌ల్లో 376 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో రెండు అర్ధశతకాలు సాధించాడు. కెప్టెన్‌ రోహిత్‌ 13 మ్యాచ్‌ల్లో (266) పరుగులు చేసినా ఒక్క అర్ధశతకం నమోదు చేయలేదు. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా అతడు చెలరేగి ఆడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సూర్యకుమార్‌ (303) ఇంతకుముందే గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవారిలో పొలార్డ్‌ (144) పరుగులే చేశాడు. దీంతో దిల్లీలాగే ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌ కూడా ఏమంత చెప్పుకునే స్థితిలో లేదు. మరోవైపు ముంబయి బౌలింగ్‌ కూడా పూర్తిగా గాడితప్పింది. ఈ మధ్య బుమ్రా (13), డేనియల్‌ సామ్స్‌ (12) రాణించడం కాస్త ఊరటనిచ్చే విషయం. మురుగన్‌ అశ్విన్‌ (9) వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని