Look out: సుశీల్‌పై బిగుస్తున్న ఉచ్చు

భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై ఉచ్చు బిగుస్తోంది. ఓ హత్య కేసులో అతడిని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు....

Published : 10 May 2021 17:37 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై ఉచ్చు బిగుస్తోంది. ఓ హత్య కేసులో అతడిని పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియడం లేదు. తప్పించుకొని తిరుగుతున్నట్టు సమాచారం.

ఈ నెల 4న దిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్‌ దంకడ్‌ అనే జాతీయ స్థాయి రెజ్లర్‌ మరణించాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్‌, అమిత్‌కుమార్‌లపై జరిగిన దాడిలో సుశీల్‌తో పాటు అతడి మిత్రులు కొందరు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తమపై దాడికి పాల్పడింది సుశీల్‌, అతడి మిత్రులే అని గాయపడ్డ ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్‌ తప్పించుకొని తిరుగుతుండటంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.

‘దాడి జరిగినప్పుడు సుశీల్‌ స్టేడియంలోనే ఉన్నాడని సాంకేతిక ఆధారాలతో ధ్రువీకరించాం. అతడిని అరెస్టు చేసేందుకు దిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. తొలుత హరిద్వార్‌లో అతడి ఆచూకీ లభ్యమైందన్నారు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందాడన్నారు. ఆ తర్వా హరియాణాలో గుర్తించామన్నారు. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని వెల్లడించారు. అందుకే లుకౌట్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని