US Open: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం: టైటిల్‌ గెలుచుకున్న ఎమ్మా రదుకాను

 యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ పోరులో 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌(కెనడా)ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది.  

Updated : 13 Sep 2021 01:30 IST

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మహామహులను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఫైనల్‌ పోరులో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది.  

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు.

ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు చేరింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో తనే నంబర్‌ వన్‌ క్రీడాకారిణి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు