T20 World Cup 2021: ఎదురులేని ఇంగ్లాండ్‌.. వరుసగా నాలుగో విజయం..

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జోరు కొనసాగుతోంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో.. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Published : 02 Nov 2021 01:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జోరు కొనసాగుతోంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో.. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో హసరంగ (34) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌ రెండేసి వికెట్లు తీయగా, క్రిస్‌ వోక్స్‌, లివింగ్‌స్టోన్ తలో వికెట్‌ తీశారు. 

164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మొయిన్ అలీ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి పరుగు తీసే క్రమంలో ఓపెనర్‌ పతుమ్‌ నిశాంక (1) రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్‌ అసలంక (21: 16 బంతుల్లో 3x4, 1x6) వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే అదిల్‌ రషీద్‌ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతడు మొయిన్‌ అలీకి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆరో ఓవర్లో కుశాల్‌ పెరీరా (7).. మోర్గాన్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (13), బనుక రాజపక్సె నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఈ జోడీని క్రిస్‌ జోర్డాన్‌ విడదీశాడు. తొమ్మిదో ఓవర్లో ఫెర్నాండో వికెట్ల ముందు దొరికిపోయాడు. కొద్ది సేపటికే రాజపక్సె (26) కూడా ఔటయ్యాడు. కెప్టెన్ దసున్‌ శనక (26), హసరంగ (34) దూకుడుగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపిస్తున్న క్రమంలో హసరంగ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శనక రనౌటయ్యాడు. దీంతో శ్రీలంక జోరుకు తెరపడింది. చమిక కరుణరత్నె (0), దుష్మంత చమీర (4), మహేశ్‌ తీక్షణ (2) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. దీంతో ఇంగ్లాండ్‌ విజయం ఖరారైపోయింది. 

అంతకు ముందు, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (101: 67 బంతుల్లో 6x6, 6x4) శతక్కొట్టాడు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (40: 36 బంతుల్లో 1x4,3x6) రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ మూడు, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని